హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్మింటన్ క్రీడను గౌరవనీయమైన క్రీడగా ప్రోత్సహించేందుకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఐదుగురు క్రీడాకారులను అంబాసిడర్లుగా ఎంపిక చేసింది.
అందులో సైనా నెహ్వాల్ ఒకరు. మొత్తం ఐదుగరు టాప్ ప్లేయర్లను 'ఫెయిర్ అండ్ హనరబుల్ స్పోర్ట్ ఇంటిగ్రిటీ అంబాసిడర్స్' గా ఎంపిక చేసినట్లు బీడబ్ల్యూఎఫ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. వీరంతా కూడా బ్యాడ్మింటన్ను క్లీన్, ఫెయిర్, గౌరవనీయమైన క్రీడగా ప్రమోట్ చేయనున్నారు.
డెన్మార్క్కు చెందిన క్రిస్టిన్నా పిడెర్సెన్, విక్టర్ అక్సెల్సెన్లు, జపాన్కు చెందిన డబుల్స్ పెయిర్ మిసాకి మత్సుతోమో, అయకా తకాహషిలు ఈ ఐదుగురిలో ఉన్నారు. దుబాయిలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ సందర్భంగా బీడబ్ల్యూఎఫ్ డిప్యూటీ ప్రెసిడెంట్ గుత్సావో సలాజర్ అంబాసిడర్లను మీడియాకు పరిచయం చేశారు.

బ్యాడ్మింటన్ను ప్రపంచ వ్యాప్తంగా మరింతగా వృద్ధి చేసేందుకు గాను బీడబ్ల్యూఎఫ్ తీసుకున్న కొత్త చర్యల్లో 'ఇంటిగ్రిటీ ప్రోగ్రామ్' అని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా బీడబ్ల్యూఎఫ్ తరఫున అంబాసిడర్లు ప్రపంచ వ్యాప్తంగా వీరు పలు క్యాంపెయిన్లలో పాల్గొంటారు.