లండన్ : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత స్టార్ సైనా నెహ్వాల్ ప్రీక్వార్టర్స్ కు చేరుకొంది. బుధవారం ఏక పక్షంగా సాగిన రెండో రౌండ్ లో ఆరో సీడ్ సైనా 21-10, 21-7 తేడాతో ఐర్లాండ్ క్రీడాకారిణి మాగిని ఓడించింది. ప్రారంభం నుంచే సైనా దూకుడైన ఆటను కనబరిచింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ మ్యాచ్ పై పట్టు సాధించింది. చెలరేగి ఆడిన సైనా 21-10 తేడాతో తొలి గేమ్ ను కైవసం చేసుకొంది. రెండో గేమ్ లో సైనా మరింతగా విజృంభించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ 21-7 తేడాతో రెండో గేమ్ ను దక్కించుకొంది. తొలి రౌండ్ లో బై దక్కించుకున్న సైనా రెండో రౌండ్ లో సునాయాస విజయంతో ప్రీక్వార్టర్స్ బెర్త్ ను ఖాయం చేసుకొంది.డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. తన భాగస్వాములు అశ్విని పొన్నప్ప, దిజులతో కలిసి ఈ హైదరాబాదీ మహిళల డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరుకుంది. మహిళల డబుల్స్ రెండో రౌండ్ లో జ్వాల-అశ్విని ద్వయం 21-18, 21-18తో ప్రపంచ మూడో ర్యాంక్ జంట, రెండో సీడ్ వెన్ హిసింగ్ చెంగ్-యు చిన్ చియెన్ (చైనీస్ తైపీ) జోడిపై సంచలన విజయం సాధించింది. మిక్స్ డ్ తొలి రౌండ్ లో బై పొందిన జ్వాల-దిజు జంట రెండో రౌండ్ లో 21-11, 21-15తో జియన్-సూక్ చిన్ చోంగ్ (మలేసియా) జోడిపై గెలిచింది. పురుషుల సింగిల్స్ లో భారత రైజింగ్ స్టార్ అజయ్ జయరామ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పారుపల్లి కశ్యప్ రెండో రౌండ్ లోనే నిష్ర్కమించాడు. తొలిసారి ప్రపంచ చాంపియన్ షిప్ లో ఆడుతున్న చెన్నై ప్లేయర్ జయరామ్ 21-19, 21-17తో వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. ప్రిక్వార్టర్స్ లో జయరామ్ డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ చెన్ జిన్ (చైనా)తో ఢీ కొంటాడు. 81 నిమిషాలపాటు జరిగిన మరో మ్యాచ్ లో ప్రపంచ 25వ ర్యాంకర్ కశ్యప్ 22-24, 21-17, 20-22తో ఏడో సీడ్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో ఓటమి పాలయ్యాడు. నిర్ణాయక మూడో గేమ్ లో కశ్యప్ 20-15తో విజయం అంచుల్లో నిలిచాడు. కానీ ఎన్గుయెన్ అనూహ్యంగా పుంజుకొని వరుసగా ఏడు పాయింట్లు సంపాదించి కశ్యప్ ను ఇంటిదారి పట్టించాడు. #13;