కౌలాలంపూర్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మలేషియా ఓపెన్ సెమీ ఫైనల్లో ఓటమి పాలైంది. చైనా క్రీడాకారిణి లీ జ్యూరీ చేతిలో 21-13, 17-21, 20-22 తేడాతో సైనా ఓటమిపాలైంది. ఈ టోర్నీలో ఓటమి పాలైన సైనా నెహ్వాల్ తన ప్రపంచ నెంబర్ 1ను కూడా కోల్పోయింది.
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ గెలిచిన లీ.. సైనా నెహ్వాల్ను ఇప్పటికి 8 సార్లు ఓడించింది. కాగా, సైనా నెహ్వాల్ 2010 సింగపూర్ ఓపెన్లో, 2012లో జరిగిన ఇండోనేషియా ఓపెన్లో లీని ఓడించింది.
శుక్రవారం జరిగిన టోర్నమెంటులో చైనా క్రీడాకారిణి సన్ యును ఓడించిన సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. కాగా, సెమీ ఫైనల్లో మరో చైనా క్రీడాకారిణి లీ చేతిలో ఓటమిపాలైంది.
ఇటీవలే ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సాధించి చరిత్ర సృష్టించిన సైనా నెహ్వాల్.. మలేషియా ఓపెన్ సెమీ ఫైనల్లో ఓటిమితో తన నెంబర్ 1 స్థానాన్ని కూడా కోల్పోయింది.