
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నుంచి భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్లో రెండు సార్లు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ తైజు యింగ్ చేతిలో సైనా నెహ్వాల్ 15-21, 19-21తో పోరాడి ఓడిపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి తడబాటు కనబర్చిన సైనాను కేవలం 37 నిమిషాల్లోనే తైజు ఇంగ్ ఓడించింది.
ప్రపంచ నంబర్ వన్ షట్లర్గా కొనసాగుతున్న తైజు చేతిలో సైనా నెహ్వాల్ ఓడిపోవడం ఇది వరుసగా 13వసారి కావడం విశేషం. గతేడాది ఇదే టోర్నీ తొలి రౌండ్లో తై జు యింగ్ చేతిలో సైనా ఓడిపోయింది. మొత్తంగా ఈ చైనీస్ తైపీ చేతిలో ఆమెకిది 15వ ఓటమి. 2013లో స్విస్ ఓపెన్లో చివరిసారి తై జు యింగ్పై గెలిచిన సైనా ఆ తర్వాత తైజుని ఓడించలేకపోయింది.
రెండో గేమ్లో సైనా 8-3తో... 10-6తో... 13-10తో ఆధిక్యంలోకి వెళ్లినా ఆ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయింది. తొందరగా గేమ్ను సొంతం చేసుకోవాలనే తాపత్రయంలో స్కోరు 19-19 వద్ద సైనా అనవసర తప్పిదాలకు పాల్పడటంతో తై జు యింగ్కు పాయింట్లు కోల్పోయి గేమ్తో పాటు మ్యాచ్ని కోల్పోయింది.
మ్యాచ్ అనంతరం సైనా మాట్లాడుతూ "ఈ మ్యాచ్లో నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాను. వాంతులు, విరేచనాలతో బాధపడ్డాను. కడుపులో నొప్పి కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేదు. అయినప్పటికీ రెండు మ్యాచ్లు ఆడి గెలవగలిగాను. తై జు యింగ్తో పదే పదే ఆడటం మంచిదే. ఆమెను ఎలా ఓడించాలనే విషయం నేర్చుకోవాల్సి ఉంది" అని అన్నారు.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ 12-21, 16-21తో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మొమోటా చేతిలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ శ్రీకాంత్కిది వరుసగా ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం.
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకూ ఇద్దరు భారత షట్లర్లు మాత్రమే టైటిల్ని గెలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొణె విజేతగా నిలవగా.. 2001లో పుల్లెల గోపీచంద్ టైటిల్ సాధించారు. అప్పటి నుంచి టైటిల్ కోసం భారత్ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.