మంగళవారం నుంచి న్యూజిలాండ్ ఓపెన్ టోర్నీ ప్రారంభం అవుతోంది. మంగళవారం క్వాలిఫయింగ్ విభాగంలో మ్యాచ్లు జరగనుండగా.. మెయిన్ డ్రా మ్యాచ్లు బుధవారం నుండి మొదలవుతాయి. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ టైటిల్ విజేతగా నిలవడమే లక్ష్యంగా బరిలో దిగుతుంది. సైనా సింగిల్స్ తొలి రౌండ్లో వాంగ్ జియి (చైనా)తో తలపడనుంది.
గతవారం ఆసియా చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లోనే సైనా నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది సైనా ఇప్పటికే ఇండోనేసియా మాస్టర్స్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది భారత్ నుంచి సైనా నెహ్వాల్ మాత్రమే అంతర్జాతీయ టైటిల్ను సాధించింది. మరో స్టార్ పీవీ సింధు ఈ టోర్నీ బరిలో దిగట్లేదు.
పురుషుల సింగిల్స్లో సాయి ప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్, శుభంకర్ డేలు పోటీలో ఉన్నారు. తొలిరౌండ్లో ప్రణీత్.. శుభంకర్తో, ప్రణయ్.. కీన్ యీ (సింగపూర్)తో పోటీపడనున్నారు. ఇక క్వాలిఫయింగ్లో అజయ్ జయరామ్, లక్ష్య సేన్, పారుపల్లి కశ్యప్లు బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో మను అత్రి-సుమీత్ రెడ్డి జోడీ.. మహిళల డబుల్స్లో నేలకుర్తి సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంటలు పోటీపడనున్నాయి.