హైదరాబాద్: మోకాలి గాయం కారణంగా రియో ఒలింపిక్స్లో నిరాశపరిచిన భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ డిసెంబర్కల్లా పూర్తిగా కోలుకోగలనని ఆశాభావం వ్యక్తంచేసింది. మోకాలిగాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్న సైనా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది.
'ఘనంగా పునరాగమనం చేస్తా. మరో రెండు మూడేళ్లలో బాగా రాణించగలననే నమ్మకముంది. గత ఐదారేళ్లలో రాణించిన దానికంటే గొప్పగా వచ్చే మూడేళ్లు మరింత కృషి చేస్తా. డిసెంబర్కల్లా పూర్తిగా కోలుకోవచ్చు' అని సైనా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

అంతేగాక, 'అంతా సజావుగానే జరిగితే దుబాయ్ వరల్డ్ సూపర్సిరీస్ ఫైనల్స్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. 100 శాతం ఫిట్గా ఉన్నాకే తిరిగి బరిలోకి దిగాలనుకుంటున్నా'అని సైనా స్పష్టం చేసింది.
కాగా, ఇక గతనెలలో ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్లోనూ సైనా నాలుగు స్థానాలు కోల్పోయి తొమ్మిదో ర్యాంక్కు పడిపోయింది. అయితే త్వరలో జరిగే జపాన్, డెన్మార్క్, ఫ్రాన్స్ సూపర్సిరీస్లలో సైనా పాల్గొనే అవకాశం కనిపించడంలేదు. ఈ ప్రభావం ఆమె ర్యాంక్పై మరింత పడనుంది.
దీనిపై ఆమె స్పందిస్తూ 'ర్యాంకింగ్స్లో దిగజారడం విచారించాల్సిన విషయమే. కానీ అద్భుత ప్రదర్శనతో 2009లో ప్రపంచ రెండో ర్యాంక్లో నిలిచాను' అని గుర్తు చేసింది. రియోలో బాగా ఆడాలని కోరుకున్నా.. మోకాలి నొప్పితో ఆడలేకపోయానని తెలిపింది. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు మూడు నెలలపాటు సైనా నెహ్వాల్ విశ్రాంతి తీసుకుంటోంది. ఫిజియో, ట్రైనర్ సాయంతో డిసెంబర్లో పూర్తి ఫిట్నెస్తో బరిలోకి దిగుతానని సైనా స్పష్టం చేసింది.