న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ భూషణ్ అవార్డుకు హైదరాబాద్కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ను కేంద్ర క్రీడా మంత్రిత్వ తిరస్కరించాలని నిర్ణియించింది. ఆమె దరఖాస్తును మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. దీంతో సైనా నెహ్వాల్ తీవ్ర అసంతృప్తికి గురైంది. పద్మ భూషణ్ ఆవార్డు సైనా నెహ్వాల్ పేరును సిఫార్సు చేస్తూ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిరుడు ఆగస్టులో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసింది.
అయితే, క్రీడా మంత్రిత్వ శాఖ రెండు మార్లు ఒలింపిక్ పతకం గెలిచిన రెజ్లర్ సుశీల్ కుమార్ను ఆ అవార్డుకు ఎంపిక చేసింది. పద్మ భూషణ్ అవార్డు కోసం క్రీడా మంత్రిత్వ శాఖ సుశీల్ కుమార్ పేరును ప్రత్యేకమైన కేసుగా హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తోందని, తన పేరును మాత్రం పంపలేదని 2010లో పద్రశ్రీ అవార్డు పొందిన ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ అన్నారు.
రెండు పద్మ అవార్డులకు మధ్య ఐదేళ్ల తేడా ఉండాలని మార్గదర్శ సూత్రాలు చెబుతున్నాయని, సుశీల్ కుమార్ పేరును సిఫార్సు చేసినప్పుడు ఐదేళ్ల తేడా ఉన్న తన పేరును ఎందుకు పంపలేదని సైనా అన్నారు. తనకు ఇది చాలా చెడుగా అనిపిస్తోందని అన్నారు.

ఐదేళ్ల తేడా లేదనే ఉద్దేశంతో నిరుడు సైనా నెహ్వాల్ పేరును మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. 2011లో పద్మశ్రీ అవార్డు పొందిన సుశీల్ కుమార్ ఐదేళ్లు పూర్తి చేయనప్పటికీ ఆయన పేరును పంపించారు. పద్మ భూషణ్ అవార్డు కోసం నిరుడు తాను దరఖాస్తు పంపినప్పుడు ఐదేళ్లు పూర్తి కాలేదని, ఈ ఏడాది దరఖాస్తు చేయడం సరి కాదని చెప్పిందని ఆమె గుర్తు చేశారు. ఈ ఏడాది మళ్లీ తాను దరఖాస్తు చేసుకున్నానని చెబుతూ ఇప్పుడు ఎందుకు తన పేరు సిఫార్సు చేయలేదని ప్రశ్నించారు.
2010 తర్వాత తాను కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకం సాధించానని, బ్యాడ్మింటన్లో తొలి పతకం సాధించానని, కెరీర్లో రెండో అత్యుత్తమ ర్యాంక్ సాధించానని, చాలా సూపర్ సరీస్ టైటిల్స్ గెలుచుకున్నానని, దాంతో తాను పద్మ విభూషన్ అవార్డుకు అర్హత ఉందని భావించానని, అయినప్పటికీ తన పేరును సిఫార్చు చేయలేదని, ఇదేం బాగా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాను నిన్న ఉన్నతాధికారులతో మాట్లాడానని, సుశీల్ కుమార్ పేరు సిఫార్చు చేశామని చెప్పారని, తన విషయం పరిశీలించాలని మాత్రమే తాను విజ్ఞప్తి చేయగలనని, తామిద్దరికీ ఆ అవార్డు వస్తే మంచిదని, ప్రత్యేకమైన కేసుగా పరిగణించి సుశీల్ కుమార్ పేరు సిఫార్చు చేసినప్పుడు నిబంధనల మేరకు నడుచుకుంటే తన పేరు ఎందుకు సిఫార్సు చేయరని, తన పేరు పంపాల్సిందేనని ఆమె అన్నారు.
సుశీల్ కుమార్ గొప్ప క్రీడాకారుడని, కానీ పతకం పతకమేనని, ఒలింపిక్స్లో ఇద్దరమూ పతకాలు సాధించామని, సుశీల్ కుమార్కు 2012 ఓలింపిక్స్ తర్వాతనే ప్రత్యేక కేసుగా అవార్డు ఇవ్వాల్సిందని, ఇప్పుడెందుకు ఇస్తున్నారని, తాను తీవ్రమైన నిరాశకు గురయ్యాయని ఆమె అన్నారు.