హైదరాబాద్: చైనా ఓపెన్ సూపర్ సిరిస్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ జపాన్కు చెందిన ఐదో సీడ్ యమగూచి చేతిలో 18-21, 11-21 ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
చైనా ఓపెన్ సూపర్ సిరిస్: రెండో రౌండ్లోకి సైనా నెహ్వాల్
37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సైనా ఏ దశలోనూ మయగూచికి పోటీ ఇవ్వలేకపోయింది. రెండో గేమ్లో 11-8 పాయింట్ల వద్ద బ్రేక్ పాయింట్ సాధించిన యమగూచి ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. తాజా ఓటమితో ఈ ఏడాది యమగూచితో తలపడిన నాలుగుసార్లు సైనా ఓటమి పాలైంది.
గతంలో వీరిద్దరూ నాలుగుసార్లు తలపడగా ఒక మ్యాచ్లోనే సైనా విజయం సాధించింది. ప్రస్తుత ర్యాంకుల్లో యమగూచి నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. గతంలో 2014లో సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ సూపర్ సిరిస్ విజేతగా నిలిచింది. అనంతరం 2015లో ఇదే టోర్నీలో రన్నరప్తో సరిపెట్టుకుంది.
హెచ్ఎస్ ప్రణయ్ కూడా ఓటమి:
చైనా ఓపెన్ టోర్నీ నుంచి భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కూడా నిష్క్రమించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్లో ప్రపంచ 11వ ర్యాంక్ క్రీడాకారుడైన ప్రణయ్.. చైనాకు చెందిన చీక్ యు లీ (53వ ర్యాంక్) చేతిలో ఓడిపోయాడు. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో 21-19, 21-17తో రెండు వరుస సెట్లలో లీ విజయం సాధించాడు.
సైనా, ప్రణయమ్ ఇంటి ముఖం పట్టడంతో ప్రస్తుతం ఈ సూపర్ సిరీస్లో భారత్ తరఫున పీవీ సింధు మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆశలన్నీ ఆమెపైనే ఉన్నాయి. సింధు కూడా తొలి రౌండ్లో చెమటోడ్చి గెలిచింది. జపాన్ క్రీడాకారిణి, అన్సీడెడ్ సయాకా సాటోపై రెండో సీడ్ సింధు 24-22, 23-21తో కష్టపడి విజయం సాధించింది. రెండో రౌండ్లో చైనాకు చెందిన హాన్ యుతో సింధు తలపడుతుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.