హైదరాబాద్: కౌలలాంపూర్ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో 16-21, 13-21 తేడాతో కరోలినా మారిన్ చేతిలో ఓడిన సైనా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తొలి గేమ్లో 1-4తో వెనుకబడిన మారిన్.. ఆ తర్వాత ఒక్కో పాయింటే గెలుస్తూ సైనాను సమీపించింది. ఒకానోక దశలో వీరిద్దరూ 14-14 పాయింట్లతో సమం అయ్యారు. ఈ సమయంలో వరుసగా 6 పాయింట్లు సాధించిన కరోలినా మారిన్ ఆధిక్యంలో దూసుకెళ్లడంతో పాటు 16-21తో తొలి గేమ్ను సొంతం చేసుకుంది.
ఇక, రెండో గేమ్లోనూ సైనా పుంజుకోలేక పోయింది. దూకుడుగా ఆడిన మారిన్ రెండో గేమ్ను కూడా 21-13 తేడాతో గెలుపొందింది. 40 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో మూడుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన కరోలినా మారిన్.. సైనాకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు.
తాజా ఓటమితో సైనా-మారిన్ ముఖాముఖి పోరు 5-6గా ఉంది. 2017లో మలేషియా ఓపెన్ టైటిల్ గెలిచిన సైనా.. 2011లో రన్నరప్గా నిలిచింది. ఈ టోర్నీలో ఏడో సీడ్గా బరిలో దిగిన సైనా 21-18, 23-21 తేడాతో జపాన్కు చెందిన రెండో సీడ్ నొజొమి ఒకుహరను ఓడించి సెమీస్ చేరింది.
క్వార్టర్స్లో అద్భుత ఆటతీరు కనబర్చిన సైనా.. సెమీస్లో ఆ స్థాయి ఆటతీరును కనబర్చలేక ఓడిపోయింది. ఇక, శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో కొరియాకు చెందిన సాన్ వాన్ చేతిలో ఓడిన కిదాంబి శ్రీకాంత్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.