న్యూఢిల్లీ: వచ్చే నెల జరిగే బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో తాను ఆడగలనని చికెన్ ఫాక్స్ తో బాధపడుతున్న సైనా నెహ్వాల్ విశ్వాసం వ్యక్తం చేసింది. గత శనివారం తనకు జ్వరం వచ్చిందని, చికెన్ ఫాక్స్ వచ్చినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని, దాంతో వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పింది. ప్రపంచ కప్ సమీపించిన నేపథ్యంలో తనకు చికెన్ ఫాక్స్ రావడం తనను ఎంతో అసంతృప్తికి గురి చేసిందని, కొద్ది రోజుల్లో మళ్లీ వైద్యుడ్ని సంప్రదిస్తానని, పరిస్థితులు ఎలా ఉంటాయో చూస్తానని ఆమె వివరించింది. టోర్నమెంట్ నాటికి తాను బాగవుతానని, అయితే ప్రాక్టీస్ చేయలేకపోతానని, గత నెల రోజులుగా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నానని ఆమె చెప్పింది.