హైదరాబాద్: మహమ్మారి కరోనాపై యుద్ధానికి తన వంతు సాయం చేసేందుకు తెలుగు షట్లర్, ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్ ముందుకొచ్చాడు. ప్రణీత్ రూ.4లక్షలను విరాళంగా ప్రకటించాడు. పీఎం సహాయ నిధికి రూ.3లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.లక్షను విరాళంగా అందించినట్టు బుధవారం ప్రణీత్ ట్వీట్ చేశాడు.
కరోనా కోసం.. 102 ట్రోఫీలను విక్రయించిన యువ ప్లేయర్!!
'కరోనాపై పోరాటంలో నా వంతు సాయంగా ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.3 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1 లక్ష విరాళంగా అందించా. ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో నా సాయం దేశానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నా. అందరూ ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నా' అని సాయి ప్రణీత్ ట్వీట్ చేశాడు.
మరో తెలుగు షట్లర్ పారుపల్లి కశ్యప్ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళం అందజేశారు. కశ్యప్ తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.3 లక్షల విరాళం ఇచ్చాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య పోలీస్ సిబ్బందికి సెల్యూట్ చేయాలని కశ్యప్ ట్వీట్ చేశాడు. ప్రజలందరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరాడు.
కరోనా కట్టడి కోసం ఇప్పటి వరకు బ్యాడ్మింటన్ నుంచి చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ (రూ. 26 లక్షలు), పీవీ సింధు (రూ. 10 లక్షలు), శ్రీకృష్ణ ప్రియ (రూ. 5 లక్షలు) విరాళాలు ఇచ్చారు. హాకీ ఇండియా (హెచ్ఐ) ఇప్పటికే పీఎం-కేర్స్ రిలీఫ్ ఫండ్ కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించగా.. తాజా ఒడిశా సీఎం సహాయనిధికి రూ. 21 లక్షలు ఇచ్చింది.
కోవిడ్-9పై పోరాటానికి చెస్ క్రీడాకారులందరూ ఏకమయ్యారు. ఆన్లైన్ టోర్నీల్లో పాల్గొనడం, విరాళాల ద్వారా రూ. 3 లక్షలకు పైగా నిధుల్ని సమకూర్చారు. తమిళనాడుకు చెందిన చెస్ కోచ్ ఆర్బీ రమేశ్కు చెందిన చారిటబుల్ ట్రస్ట్ 'చెస్ గురుకుల్'కు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ రూ. 2 లక్షలు, కార్తికేయన్ మురళి రూ. 25,000 విరాళం ఇచ్చారు.