న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ స్టార్స్ను దుస్తుల వివాదం వెంటాడుతోంది. ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్లో భారత్కు బ్యాడ్మింటన్లో రజత పతకాన్ని సాధించిన తెలుగు తేజం పీవీ సింధు తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సదరు వివాదం పెద్దది కాకున్నా, స్పాన్సర్లతో కుదిరిన ఒప్పందాలను ధిక్కరిస్తూ సింధు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముంబై మిర్రర్లో ప్రచురించిన వార్తా కథనం ప్రకారం ఇటీవల బ్రెజిల్లో ముగిసిన రియో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత ఒలింపిక్ సంఘంతో ప్రముఖ సంస్ధ 'లీ నింగ్' అనే సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.3 కోట్లను భారత ఒలింపిక్ సంఘానికి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఇందులో భాగంగా రియో ఒలింపిక్స్లో పాల్గొనే భారత క్రీడాకారులంతీ తమ దుస్తులనే వాడాలని షరతు విధించింది. అయితే పీవీ సింధుతో పాటు దీపా కర్మాకర్, యోగేశ్వర్ దత్, కిడాంబి శ్రీకాంత్ లు పలు మ్యాచ్ ల్లో లీ నింగ్ బ్రాండ్ దుస్తులు కాకుండా ఇతర కంపెనీలవి వాడారట.
దీనిపై భారత్లో లీ నింగ్ బ్రాండ్ దుస్తుల డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తోన్న సన్లైట్ స్పోర్ట్స్ ప్రై. లిమిటెడ్ సంస్ధ ఎండీ మహేందర్ కపూర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత ఒలింపిక్ సంఘానికి లేఖ రాశారు. ఈ సందర్భంగా కపూర్ ముంబై మిర్రర్ న్యూస్ పేపర్తో రియో ఒలింపిక్స్కు స్పాన్సర్గా వ్యవహించామని, పారాలింపిక్స్ జట్టుకు కూడా వ్యవహరిస్తున్నామని చెప్పారు.
తాను ఆటగాళ్లను నిందించడం లేదని, అయితే కొంత మంది కావాలనే వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారని అన్నారు. అయితే లీ నింగ్ దుస్తులు అంత సౌకర్యవంతంగా లేకపోవడం, ముఖ్యంగా రంగుల కలయిక బాగుండక పోవడం వల్లనే సింధు వాటిని ధరించలేదని ఐఒఎ వర్గాలకు తెలియజేసినట్లుగా చెబుతున్నారు.
పీవీ సింధు, దీపాకర్మాకర్లతో పాటు రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ కూడా ఓ వివాదంలో చిక్కుకున్నారు. కాగా రియో ఒలింపిక్స్లో భారత్కు పతకం సాధించలేకపోయినా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.