హైదరాబాద్/విజయవాడ: రియో ఒలింపిక్స్లో ఫైనల్లో కరోలినా మారిన్తో తలపడి రజితంతో సరిపెట్టుకున్న తెలుగు తేజం పీవీ సింధు పైన ప్రశంసలు కురుస్తున్నాయి. స్వర్ణం గెలవకున్నా.. రజితం గెలిచిన సింధూ భారతీయుల మనసులను గెలుచుకుంది. సింధు గెలుపు పైన ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ... పీవీ సింధు రజితం గెలవడం ద్వారా చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. సింధుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రజితం సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిందన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు. సింధు విజయం దేశానికి గర్వకారణమని, ఆమె పతకం సాధించడానికి కారణమైన కోచ్ గోపీచంద్కు ప్రత్యేక అభినందనలు అన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కూడా సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఏ పతకమనేది ముఖ్యం కాదు: జూ.ఎన్టీఆర్
స్వర్ణమా, రజితమా, కాంస్యమా.. ఏ మెడల్ గెలిచిందన్నది ముఖ్యం కాదని, భారతీయులందరి మనసులు గెలుచుకుందని హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. పోరాటమే అసలైన గెలుపు అన్నారు. ఛాంపియన్ లెక్క పోరాడావని, కంగ్రాంట్స్ అని జూ.ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
సింధు బంగారం: రాజమౌళి, ఫ్యాన్గా మారా: రజనీకాంత్
పీవీ సింధుకు సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగు సెన్షేషనల్ డైరెక్టర్ రాజమౌళిలు శుభాకాంక్షలు తెలిపారు. సింధు దేశానికి గర్వకారణమని, ఆమె దేశానికే బంగారమని రాజమౌళి పేర్కొన్నారు. సింధు ఆటను చూసి నేను ఆమెకు ఫ్యాన్గా మారిపోయానని రజినీకాంత్ చెప్పారు.

సింధు తండ్రి స్పందన
సింధు చాలా బాగా ఆడిందని, చివరి వరకు పోరాడిందని ఆమె తండ్రి రమణ అన్నారు. భారత్ నుంచి ఒలింపిక్స్కు వెళ్లడం గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా ఆడి స్వర్ణం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కోచ్ గోపీచంద్, సహకరించిన అందరికీ సింధు తండ్రి ధన్యవాదాలు తెలిపారు.
తొలి సెట్లో అద్భుతంగా పుంజుకున్నా, రెండో సెట్, మూడో సెట్లలో అవకాశాలు కల్పించుకోవడంలో సింధూ వెనుకబడిందన్నారు. ప్రత్యర్థిని కోలుకోనివ్వకుండా ఆడడం ఎలా అన్నది నేర్చుకుంటుందన్నారు. మారీన్ అద్భుతంగా ఆడిందని, సింధుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడిందని ప్రశంసించారు.
అయితే సింధు దేశ ప్రజలను నిరాశపర్చలేదని, దేశానికి బహుమతిగా రజితం తీసుకుని వస్తుందన్నారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇంత వరకు క్రీడాకారిణి సాధించని ఘనతను సాధించిందన్నారు. సింధును చూసి తల్లిదండ్రులుగా తాము, బిడ్డగా భరత మాత గర్విస్తోందన్నారు.