రియో డీ జనీరో: ఒలింపిక్స్లో ఫైనల్ చేరి పతకం ఖరారు చేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె సాధించిన ఈ విజయం వెనక ఎంతో కఠోర శ్రమ ఉందని పలువురు ప్రముఖులు కొనియాడారు. కాగా, ఆమె గెలుపునకు ఆమె అద్భుతమైన ఫిట్నెస్ కారణమని చెప్పవచ్చు.
కాగా, రియో ఒలింపిక్స్లో తొలుత మిచెలి లీ (కెనడా).. తర్వాత యింగ్ తై జు (చైనీస్ తైపీ).. ఆనక యిహాన్ వాంగ్ (చైనా).. తాజాగా నొజొమి ఒకుహర (జపాన్)! వీరితో ఆడిన మ్యాచ్ల్లో సారూప్యంగా కనిపించిన ఏకైక అంశం.. సింధు విజయగర్జన.. ఆమె విజయకాంక్ష. ఆ గర్జనలతోనే ఆమెలో పాయింటు పాయింటుకు విజయకాంక్ష పెరగాలన్నది కోచ్ పుల్లెల గోపీచంద్ ఆదేశం.

అలా ప్రతి పాయింటుకు పిడికిలి బిగిస్తూ విజయకాంక్షను ప్రదర్శించింది సింధు. ఫలితమే.. ఒలింపిక్స్లో ఒక్కొక్కరుగా అగ్రశ్రేణి క్రీడాకారిణులంతా ఆమె చేతిలో పరాజితులుగా మిగిలిపోవడం.
తానెంటో నిరూపించుకున్న సింధు
బ్యాడ్మింటన్లో ఒలింపిక్సే అత్యున్నత టోర్నీ. పతకాలు సాధించాలన్నా.. ప్రతిభ చాటుకోవాలన్నా అంతకంటే అత్యుత్తమ వేదిక మరొకటి ఉండదని చెప్పవచ్చు. అందుకే ఒలింపిక్స్ అనగానే చైనా క్రీడాకారులు మరింత రెచ్చిపోతారు. రెట్టించిన ఉత్సాహంతో ఆడతారు. అలాంటి వేదికపై.. అప్పటికే రజతం సాధించిన చైనా క్రీడాకారిణిని కంగుతినిపించడం సింధుకే సాధ్యమైంది.

క్వార్టర్ఫైనల్లో యిహాన్ను ఓడించిన సింధు.. తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసింది. అనుభవం.. ఆట రెండూ ఉన్న యిహాన్ను అనామక క్రీడాకారిణిగా మార్చేసింది. గురువారం సెమీస్లో ఒకుహరను మట్టికరిపించింది. సింధుపై 3-1తో మెరుగైన రికార్డున్న ఒకుహర.. ఆమె విశ్వరూపం ముందు ప్రేక్షకురాలిగా మిగిలిపోయింది.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
తనదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తుచేయడం సింధులోని ప్రత్యేక లక్షణం. అయితే ఆ లక్షణాన్ని మెరుగు పర్చుకుంది సింధు. అగ్రశ్రేణి క్రీడాకారిణుల్ని చిత్తుచేస్తూ మ్యాచ్మ్యాచ్కూ మరింత రాటుదేలుతోంది.
ఒకప్పుడు డిఫెన్స్లో బలహీనంగా ఉన్న సింధు.. ఇప్పుడు అందులోనూ దుర్భేధ్యంగా తయారైంది. తన ఎత్తును సద్వినియోగం చేసుకుంటున్న సింధు.. కోర్టు నలువైపులా తిరుగుతుంది. మెరుపు వేగంతో షటిల్ను అందిపుచ్చుకుంటుంది. కోర్టు మధ్యలో ఉంటూ రెండు వైపులా షటిల్ను సమర్థంగా తిప్పికొడుతోంది. అదే సమయంలో ప్రత్యర్థికి రెండు వైపులా క్రాస్కోర్ట్ షాట్లు సంధిస్తోంది.
ఇక సింధులో కనిపిస్తున్న మరో అంశం.. వేగం. కెరీర్లోనే అత్యుత్తమ ఫిట్నెస్తో ఉన్న సింధు.. వేగంలో బాగా పుంజుకుంది. ప్రస్తుతం మహిళల సింగిల్స్లో అత్యంత చురుకైన క్రీడాకారిణి ఒకుహర. అలాంటి అమ్మాయిని సింధు మూడు చెరువుల నీళ్ళు తాగించింది.
కోర్టులో అన్ని మూలలా పరుగెత్తించి అలసిపోయేలా చేసింది. ఒకుహర కంటే ఎక్కువే మైదానంలో కదిలిన సింధు ముఖంలో ఎక్కడా అలసట కనిపించలేదు. ప్రస్తుతం సింధు ఫిట్నెస్ ముందు ఎవరూ ఎదురు నిలిచేలా లేరు. తన ఫిట్నెస్ను, విజయగర్జనను కొనసాగిస్తూ భారత్కు స్వర్ణం అందించాలని మనమంతా ఆశిద్దాం. భారత్కు రెండో స్వర్ణం అందించిన క్రీడాకారిణి సింధు కావాలని కోరుకుందాం.
ఇది ఇలా ఉంటే... సింధును ఉద్దేశించి అభినవ్ బింద్రా ట్వీట్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. 'ఒలింపిక్స్లో మనదేశం తరఫున వ్యక్తిగత స్వర్ణం సాధించిన ఆటగాళ్ల జాబితాలో నీ చేరిక కోసం ఎదురుచూస్తున్నా. ఈ జాబితాలో నన్ను ఒంటరితనం వేధిస్తోంది'అంటూ సింధు ఫైనల్ గెలుపునకు మద్దతు ప్రకటించాడు. కాగా, సింధు ఫైనల్ చేరడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. తనతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ భారత్ గర్వపడేలా చేశావంటూ కొనియాడారు. ఫైనల్ విజయం సాధించాలంటూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.