రియో డీ జెనిరో: ఈ స్థాయికి రావడానికి మామూలు ఆడపిల్లలు ఇష్టపడే చిన్నచిన్నవాటిని కూడా పివి సింధు త్యాగం చేసింది. ఆమె ఏమేమి త్యాగం చేసిందనే విషయాన్ని కోచ్ గోపీచంద్ చెప్పాడు. కరోలినా మారిన్పై ఫైనల్ మ్యాచు ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ - ఇప్పుడు సింధు పోన్ మాట్లాడుకోవచ్చునని, ఐస్ క్రీమ్ తినవచ్చునని చెప్పాడు.
ఒలింపిక్స్లో తొలి వెండి పతకం సాధించిన భారత మహిళగా రికార్డు సృష్టించిన సింధు అందుకు తీవ్రంగా కష్టించింది. గురువు గోపీచంద్ మాటను ఎక్కడా జవదాటలేదు. ఇప్పుడు తన మిత్రులతో మాట్లడడానికి 21 ఏళ్ల సింధు వాట్సప్ వాడుకోవచ్చు. తనకు ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా ఆస్వాదించవచ్చు.

సింధుకు గత మూడు నెలలుగా మొబైల్ లేదు. తొలుత ఆమెకు తాను మొబైల్ ఇస్తానని గోపీచంద్ చెప్పాడు. గత 12, 13 రోజుల నుంచి సింధును ఆమెకు ఇష్టమైన స్వీట్ కర్డ్ తిననివ్వలేదని కూడా చెప్పాడు. ఐస్ క్రీమ్ కూడా తిననివ్వలేదని, ఇప్పుడు ఆమెకు ఇష్టమైనవి తినవచ్చునని అన్నాడు. సింధు చిన్నపిల్ల అని ఆయన అన్నాడు.
గత వారం సింధు గొప్ప ప్రదర్శనను కనబరిచిందని, రెండు నెలల పాటు తీవ్రంగా శ్రమించిందని చెప్పాడు. ఏ విధమైన ఫిర్యాదులు లేకుండా సింధు త్యాగాలు చేయడం అద్భుతమైన విషయమని గోపీ చెప్పాడు. ఆనందాన్ని ఆస్వాదించడానికి ఆమెకు ఇప్పుడు అర్ఙతలున్నాయని ఆయన చెప్పాడు. తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.