ముంబై: ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కే రామ్ గోపాల్ వర్మ తాజాగా, ఒలింపిక్స్ పైన మాట్లాడాడు. రియోలో రజతం సాధించి, భారత్ వచ్చిన పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాలు ఘన స్వాగతం పలుకుతున్నాయి. హైదరాబాదులో జీహెచ్ఎంసీ ఆమెకు పెద్ద ఎత్తున స్వాగతం పలికింది.
సింధుకు తెలంగాణ గ్రాండ్ వెల్కం, ట్రాఫిక్ ఆంక్షలు, ఏపీ తరఫున దేవినేని
ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ఒక్క రజత పతకానికే మనల్ని మనం ఇన్క్రెడిబుల్ ఇండియా అని పిలుచుకుంటున్నామని, మరి 46 బంగారు, 37 వెండి, 49 కాంస్య పతకాలు సాధించిన అమెరికాను ఏమని ఏమనాలని, జస్ట్ అడుగుతున్నానని ట్వీట్ చేశాడు.

దీనికి ఓ అభిమాని ఘాటైన సమాధానం చెప్పాడు. భారత దేశంలో ప్రజలు మిమ్మల్ని ఓ దర్శకుడిగా భావిస్తున్నారని, అదే మీరు అమెరికా వెళ్తే ఓ మనిషిగా కూడా చూడరని, తేడా అంతేనని ధీటైన సమాధానం ఇచ్చాడు.
అడుగడుగునా నీ లాంటి వ్యంగ్యాస్త్రాలు వేసే వారు ఉండరు కాబట్టే, భారత్ తక్కువ పతకాలతో ఆగిపోయిందని ఒకరు, ఇక్కడి వసతులతో అమెరికా గెలిచిన పతకాలకన్నా, ఈ రెండు పతకాలే గొప్పవని మరొకరు, మన పొరుగు దేశాలకు పతకాలే లేని సమయంలో, ఉత్త చేతులతో తిరిగిరాని భారత్ను ఎందుకు అంటున్నారని మరొకరు మండిపడ్డారు.