
హైదరాబాద్: ఒలింపిక్ రజిత పతక విజేత పీవి సింధు కన్ను ఈ సారి ప్రపంచ నెంబర్ వన్ స్థానంపై పడింది. వచ్చే ఏడాదికల్లా ఆ పొజిషన్ లో ఉండాలంటూ నిశ్చయించుకుంది. రెండు నెలల క్రితం వరకు ప్రపంచ నెంబర్ 2గా కొనసాగిన సింధు ఈ సారి మొదటి స్థానానికి చేరాల్సిందేనంటూ గట్టి పంతం పట్టింది.
'వచ్చే సీజన్ సమయానికి నేను మొదటి స్థానంలో ఉండాలని ఆశపడుతున్నాను. ప్రస్తుతం 3వ ర్యాంకులో కొనసాగుతున్నాను. మనం బాగా ఆఢితే ర్యాంకింగ్ మారుతుంది. అప్పుడు అదే మనల్ని మొదటి స్థాయికి తీసుకెళ్తుంది. అంతేకానీ, ర్యాంకింగ్ ధ్యాస పెట్టి ఆడను. నా ప్రతిభను చక్కగా ప్రదర్శించడానికే ప్రాధాన్యత ఇస్తాను. అంటూ సింధు తన అభిప్రాయాలను వెల్లడించింది.
బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబై రాకెట్స్పై 4-3తేడాతో పీవి సింధు ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై స్మాషర్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వరుసగా ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ టైటిళ్లు గెలుచుకున్న సింధు, ప్రపంచ ఛాంపియన్ షిప్లో 2వ ర్యాంకర్గా నిలిచింది. ఇంకా, హాంగ్కాంగ్ ఓపెన్, దుబాయ్ సిరీస్ ఓపెన్ సిరీస్లలో ఫైనల్ వరకు వెళ్లి ఓడిపోయింది.
కొద్ది రోజులుగా బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ సమయం ఎక్కువ అవుతున్నట్లనిపిస్తుంది. సుమారు గంట గంటన్నరపాటు జరుగుతున్న గేమ్ 40నిమిషాలలో అయిపోవాలి. అని అభిప్రాయపడింది.
ప్రేక్షకులు స్టేడియం చుట్టూ కూర్చొని బాగా ఆడాలి అంటూ ప్రోత్సహిస్తుంటే ఒత్తిడిగా భావిస్తుంటారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నఅడిగింది. దానికి స్పందించిన సింధు నాకు అలా అరవడం ఒక ప్రోత్సాహంలా అనిపిస్తుంది. ఈ మధ్యనే జరిగిన దుబాయ్ ఫైనల్స్లో కూడా స్టేడియంలో నుంచి నా ఆటకు మంచి స్పందనే వచ్చిందంటూ ఆనందపడింది.
మనమీద అంచనాలనేవి ఎప్పుడూ ఉంటాయ్. వాటినే తల్చుకుంటూ ఆడకూడదు. మనం ఎంతవరకు ఆడగలమో అంతే ఆడాలి. అలాంటప్పుడు ఎలాంటి ఒత్తిడి దరిచేరదు అని హితవు పలికింది.
బీడబ్ల్యూఎప్ ఇచ్చిన షెడ్యూలు మేరకు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ జనవరి నెలాఖరున ఆరంభంకానుంది. వీటిపై స్పందించిన సింధు ప్రతి ఏడాది టోర్నమెంట్లు జరుగుతూనే ఉంటాయని, అవి ముందు వెనుక అవడం వల్ల పెద్ద నష్టమేమీ జరగదని అభిప్రాయపడింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.