హైదరాబాద్: సైనా నెహ్వాల్, పి.వి. సింధు భారత బ్యాడ్మింటన్ దశను మార్చిన ఈ ఇద్దరు స్టార్ షట్లర్లు మరోసారి హోరాహోరీగా తలపడనున్నారు. ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీలో సెమీఫైనల్లో చోటు కోసం భారత మేటి షట్లర్లు క్వార్టర్ఫైనల్లో ఢీకొననున్నారు. కాలి మడమ గాయం కావడంతో కొన్ని రోజులుగా సైనా విశ్రాంతి తీసుకుంది.
ప్రస్తుతం దాని నుంచి కోలుకోవడంతో ఈ టోర్నీలో పునరాగమనం చేసింది. ప్రిక్వార్టర్స్లో కాస్త శ్రమించగా ప్రపంచ నం.3 పి.వి. సింధు అలవోకగా ముందంజ వేసింది. సైనా 21-12, 21-18తో ప్రపంచ నం.20 చెన్ జియాక్సిన్ (చైనా)పై విజయం సాధించింది. తొలి గేమ్ ఆరంభంలో 8-3తో ఆధిక్యంలోకి వెళ్లిన హైదరాబాదీ షట్లర్ తర్వాత తేలిగ్గానే గేమ్ గెలిచింది. రెండో గేమ్లో 11-3తో విరామానికి వెళ్లిన ఆమె ఆ తర్వాత తడబడింది.
17-19తో సైనాను ప్రత్యర్థి అందుకునే ప్రయత్నం చేసింది. ఐతే సైనా పట్టు వదల్లేదు. ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్లో సింధు 21-12, 21-9తో గో జిన్ వీ (మలేసియా)ను చిత్తు చేసింది. పురుషుల విభాగంలో భారత యువ డబుల్స్ జోడీ సాత్విక్ సాయి రాజ్, చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్స్లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్లో సాత్విక్ ద్వయం 21-17, 21-16తో లియా మిన్, సు చింగ్ హెంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది.
అంతర్జాతీయ టోర్నీలో సైనా, సింధు ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడగా చెరో విజయాన్ని అందుకున్నారు. నిరుడు సింధును ఓడించి సైనా జాతీయ బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఐతే వీరిద్దరి మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం భారత ప్రేక్షకులకు లేదు. టోర్నీ ప్రసార హక్కులను కొనేందుకు ప్రసారదారులెవరూ ముందుకు రాలేదు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.