రియో డీ జెనిరో: రియో ఒలింపిక్స్ 2016 బ్యాడ్మింటన్ సింగిల్స్లో తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్కు చేరుకున్నారు. రియోలో అందరి ఆశలు ఈమె పైనే ఉన్నాయి. జపాన్ క్రీడాకారిణి నోజోమీ ఒకుహారో పైన వరుస సెట్లలో గెలిచిన సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. ఒలింపిక్స్లో ఫైనల్ చేరిన తొలి షట్లర్ సింధు.
టెక్నిక్తో పాటు ఆత్మవిశ్వాసంతో సింధు గెలుపొందింది. సింధు ఎక్కడా తొణకలేదు. పూర్తి కాన్ఫిడెన్స్ ఆమెలో కనిపించింది. దీంతో, రియోలో తెలుగు తేజం వికసించింది. వరుస సెట్లలో 21-19, 21-10తో జపాన్ క్రీడాకారిణి పైన పీవీ సింధూ గెలుపొందింది. ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినాతో పోటీ పడనుంది. బంగారు పతకానికి అడుగు దూరంలో ఉంది.

ఫస్ట్ సెట్ సింధూదే, కిందపడ్డ ప్రత్యర్థి
పీవీ సింధు తొలి సెట్లో గెలిచింది. తొలి సెట్లో సింధు మొదటి నుంచి దూకుడుగా ఆడింది. 21-19తో సింధు నోజోమీ పైన గెలుపొందింది. ఓ సమయంలో సింధు షాట్ కొట్టబోయి ప్రత్యర్థి నోజోమీ కిందపడింది.
రెండో సెట్లోనూ గెలుపు
తొలి సెట్లో దూకుడుగా ఆడిన పీవీ సింధూ రెండో సెట్లోను అదే దూకుడు కొనసాగించింది. ఇంకా చెప్పాలంటే మరింత దూకుడుగా ఆడింది. రెండో సెట్లో మరింత బాగా ఆడి.. 21-10తో ప్రత్యర్థిని మట్టి కరిపించి, ఫైనల్లోకి అడుగు పెట్టింది.
కాగా, సింధు గెలుపు కోసం దేశం యావత్తు ఎదురు చూసింది. ఆమె గెలుపుతో అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. జపాన్ ప్లేయర్ నోజోమీ ఒకుహరాతో సింధు పోటీ పడి గెలిచింది. మ్యాచ్ను అందరి ఉత్కంఠగా తిలకించారు.
- సింధూ పొడవుగా ఉంటుంది. జపాన్ క్రీడాకారిణి కాస్త పొట్టిగా ఉంటుంది. ఆ ప్రకారం ప్రణాళికలతో ఆడింది.
- ఫస్ట్ సెట్లో ఓ సమయంలో జుపాన్ క్రీడాకారిణి నోజోమీ కిందపడిపోయింది.
- హైదరాబాదులోని గోపిచంద్ అకాడమీలో సింధు తల్లిదండ్రులు, గోపిచంద్ తల్లిదండ్రులు మ్యాచ్ తిలకించారు. ఇక్కడ ప్రత్యేక తెరను ఏర్పాటు చేశారు.