హైదరాబాద్: కరోనా వైరస్ విరామం వలన తనకు మంచే జరిగిందని ప్రపంచ ఛాంపియన్, స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. విరామం తన ఆటను మెరుగుపరిచిందని తెలిపారు. సాంకేతికత మరియు నైపుణ్యాలపై మరింత దృషి పెట్టడానికి తనకు చాలా సమయం దొరికిందని సింధు పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్ 2021 సాధనపై వైరస్ ఎలాంటి ప్రభావం చూపలేదని సింధు స్పష్టం చేశారు. ప్రస్తుతం సింధు ఒలింపిక్స్ కోసం సిద్ధంగా ఉన్నారు. మహిళల సింగిల్స్లో ఆరో సీడ్గా బరిలో ఉన్న సింధు.. ప్రపంచ నంబర్ 34 చిగ్ గన్ యై, సెనియా పొలికర్పొవా తో లీగ్ దశలో తలపడనున్నారు.
తాజాగా వర్చువల్ ఇంటరాక్షన్లో పీవీ సింధు పాల్గొని పలు విషయాలపై స్పందించారు. 'కరోనా వైరస్ విరామం నాకు చాలా ఉపయోగపడిందని భావిస్తున్నా. ఎందుకంటే నా ఆటను మెరుగుపరుచుకున్నా. నా టెక్నిక్, నైపుణ్యాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి చాలా సమయం దొరికింది. ఒలింపిక్స్ సాధనపై వైరస్ ఎలాంటి ప్రభావం చూపలేదు. సన్నద్ధం కావడానికి తగినంత సమయం దొరికింది. ఏదైనా టోర్నమెంట్ కోసం వెళ్లేముందు మాకు శిక్షణ ఇవ్వడానికి సమయం ఉండదు. ఒలింపిక్స్కు శిక్షణ ఇవ్వడానికి మరియు సిద్ధం కావడానికి తగినంత సమయం లభించడం ఇదే మొదటిసారి. అందుకే వైరస్ నా సన్నాహాలపై ప్రభావం చూపిందని అనుకోను. నిజానికి నేను చాలా నేర్చుకున్నా' అని సింధు తెలిపారు.
'లీగ్ స్టేజ్లో మంచి డ్రా లభించింది. హాంకాంగ్ క్రీడాకారిణితో మ్యాచ్గా అద్భుతంగా ఉండనుంది. ప్రతి ఒక్కరు టాప్ ఫామ్లో దూసుకెళ్తున్నారు. నేను కూడా బాగా ఆడతానని అనుకుంటున్నా. ప్రతి మ్యాచ్ ఎంతో ముఖ్యం. ఇది ఒలింపిక్స్. ఈసారి అంత సులువు ఏం కాదు. ఎప్పటిలాగే భారీ అంచనాలు, బాధ్యతలు ఉంటాయని నేను అనుకుంటున్నా. మీ ప్రేమ మరియు మద్దతుతో పతకం సాధించి తిరిగి దేశానికి వస్తానని ఆశిస్తున్నా' అని 2016 రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుఅన్నారు. జులై 25న పొలికర్పొవా (ఇజ్రాయెల్)తో సింధు తొలి మ్యాచ్ ఆడనున్నారు.
'నేను చాలా మంది అభిమానులను మిస్ అవుతున్నా. అప్పటికి రియోకు చాలా భిన్నంగా ఉండనుంది. కాని మనం పరిస్థితిని అర్ధం చేసుకోవాలి. త్వరలో అంతా మాములుగా అవ్వాలని కోరుకుంటున్నా' అని పీవీ సింధు చెప్పారు. దేశం తరఫున ఈ మెగా క్రీడల్లో పాల్గొనే ప్రతిఒక్క అథ్లెట్ బాగా ఆడాలని ఆకాంక్షించారు. వారందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అంతకముందు కంటే ఈసారి భారత్ ఎక్కువ పతకాలు సాధించాలని సింధు ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్.. కరోనా కారణంగా ఏడాది వాయిదా పడ్డాయి. వైరస్ ఉద్ధృతి కాస్త నెమ్మదించడం వల్ల జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో కొవిడ్ నియమ నిబంధనలతో జరగనున్నాయి.