సెమీస్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి మెరిసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టేసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పీవీ సింధు చైనా క్రీడాకారిణి చెన్ సు యును ఏకపక్ష పోరులో మట్టికరిపించి ఘన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ కీలక మ్యాచ్లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన పీవీ సింధు.. కేవలం 31 నిమిషాల్లోనే 21-6, 21-9 తేడాతో ప్రత్యర్థిని రౌండ్లవారీగా చిత్తు చేసింది. ఈ అద్భుత విజయంతో ఈ ఏడాది తన తొలి టైటిల్ను కైవసం చేసుకునేందుకు పీవీ సింధు కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది.
ప్రస్తుత సీజన్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్న పీవీ సింధుకు ఈ విజయం ఎంతో ఊరటనిచ్చింది. ఈ ఏడాది ఆడిన 8 బీడబ్ల్యూఎఫ్ టోర్నమెంట్లలో పీవీ సింధుకు ఇది కేవలం రెండో సెమీఫైనల్ కావడం గమనార్హం. గత రౌండ్లో భారత్కే చెందిన ఈశారాణి బారువాపై విజయం సాధించి క్వార్టర్స్కు చేరిన పీవీ సింధు,.. చైనా ప్లేయర్ చెన్ సు యు ఎదురైనప్పుడు తన అనుభవాన్ని, దూకుడును కలగలపి అమోఘమైన ఆటతీరును ప్రదర్శించింది. మొదటి సెట్ను 21-6తో అలవోకగా కైవసం చేసుకున్న సింధు..రెండో సెట్లోనూ అదే జోరును కొనసాగిస్తూ 21-9తో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగిసింది.

దూసుకుపోతున్న తన్వీ శర్మ
మరోవైపు మహిళల సింగిల్స్లో భారత యువ సంచలనం, 17 ఏళ్ల తన్వీ శర్మ కూడా ఆస్ట్రేలియా వేదికగా అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది. క్వార్టర్ ఫైనల్ చేరే క్రమంలో తన్వీ శర్మ ఇండియాకే చెందిన సీనియర్ ప్లేయర్ మాళవిక బన్సోడ్ను వరుస గేముల్లో ఓడించింది. అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో తన్వీ శర్మ 21-13, 21-15 తేడాతో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు రౌండ్లో చైనాకు చెందిన ఐదో సీడ్ క్రీడాకారిణి చియు పిన్-చియాన్కు షాక్ ఇచ్చి సంచలనం సృష్టించిన తన్వీ శర్మ, అదే ఫామ్ను కొనసాగిస్తూ భారత్కు సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications