మోదీతో వీడియో కాన్ఫరెన్స్:
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 40 మంది ప్రముఖ క్రీడాకారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా పరిస్థితిపై చర్చించారు. క్రీడాకారులంతా వారి సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో పీవీ సింధు కరోనాపై వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే దేశంలో లాక్డౌన్ ఉండటంతో ఈ వీడియోని ఆమె తండ్రి పీవీ రమణ తన మొబైల్లో షూట్ చేయడం విశేషం.
కరోనాతో ఫైట్ చేయాలంటే ఇంట్లోనే ఉండాలి:
'బ్యాడ్మింటన్ కోర్టులోనే ఆడాలి.. అప్పుడే విజయం సాధిస్తాం. మహమ్మారి కరోనాతో ఫైట్ చేయాలంటే మాత్రం మనం ఇంట్లోనే ఉండాలి. భౌతికదూరం పాటిస్తేనే కరోనాపై విజయం సాధించగలం. మనకు సహాయం అందించడానికి 104 హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ సూచనలు పాటిద్దాం. ఇంట్లోనే ఉందాం.. కరోనాను కలిసి ఎదుర్కొందాం' అని సింధు పిలుపునిచ్చారు.
తెలుగు రాష్ట్రాలకు విరాళాలు:
కరోనాపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి సింధు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు అందిస్తానని ఆమె ట్వీట్ ద్వారా వెల్లడించింది. 'కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో రూ .5,00,000 విరాళంగా ఇస్తున్నా' అని పేర్కొంది.
ఒలింపిక్స్ కన్నా జీవితమే ముఖ్యం:
'ఒలింపిక్స్ను వాయిదా వేయడం మంచి నిర్ణయం. ఎందుకంటే.. ఇప్పుడు మనకు మరో అవకాశం లేదు. కరోనా కారణంగా కొందరు ప్రజలు చనిపోతున్నారు. జీవితమే ప్రథమం. టోర్నీలను సైతం రద్దు చేస్తుండడం మంచి విషయం. ప్రతి వారం, ప్రతి రోజు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒలింపిక్స్ వాయిదా పడ్డాయని నాకు కొందరు నిరాశగా చెబుతున్నారు. అయితే జీవితమే తొలి ప్రాధాన్యం.. ఆ తర్వాతే ఒలింపిక్స్' అని సింధు అంది.