హైదరాబాద్: ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్లకు సులువైన డ్రా ఎదురైంది. గురువారం ప్రారంభంకానున్న ఈ పోటీల్లో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో త్రాంగ్ థి (వియత్నాం)తో మూడో సీడ్ సింధు, సొరయ (ఇరాన్)తో సైనా తలపడతారు. సెమీస్ వరకు సింధుకు ఎదురేలేదని చెప్పొచ్చు. సెమీస్లో రెండో సీడ్ అకానె యమగూచి (జపాన్).. సింధుకు ఎదురవ్వొచ్చు.
ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్, తాజాగా ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్లో యమగూచిని సింధు మట్టికరిపించింది. ఈనేపథ్యంలో ఫైనల్ చేరడం సింధుకు కష్టం కాకపోవచ్చు. సైనా సెమీస్ చేరాలంటే క్వార్టర్స్లో నాలుగో సీడ్ ఇంతానన్ రచనోక్ (థాయ్లాండ్)ను ఓడించాలి! ప్రపంచ ఛాంపియన్షిప్లో రచనోక్పై సైనా పేచేయి సాధించింది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్లకు బై లభించింది. రెండో రౌండ్లో వాంగ్ వింగ్ (హాంకాంగ్)తో శ్రీకాంత్, కంటఫాన్ వాంగ్చరోన్ (థాయ్లాండ్)తో ప్రణయ్ పోటీపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో చుంగ్ యాని- టామ్ చున్ (హాంకాంగ్)తో సాత్విక్ సాయిరాజు- చిరాగ్శెట్టి, అహ్మద్- రషీద్ (మాల్దీవ్స్)తో సుమీత్రెడ్డి- మను అత్రి;
మహిళల డబుల్స్ తొలి రౌండ్లో వింగ్ యుంగ్- యూంగ్ టింగ్ (హాంకాంగ్)తో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప, చాయానిత్- మ్యూన్వాంగ్ (థాయ్లాండ్)తో రుతుపర్ణ- ఆరతి; మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో పెంగ్ సూన్- ల్యూ యింగ్ (మలేసియా)తో ప్రణవ్ చోప్రా- సిక్కిరెడ్డి, లీ చున్- చౌ హోయ్ (హాంకాంగ్)తో సాత్విక్- అశ్విని తలపడతారు.