హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడేందుకు క్రీడలు కీలకంగా ఉపయోగపడుతాయని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక శ్రమను తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు పెరిగిపోతుండగా.. మరోవైపు ఇప్పటి వరకు దాని నివారణ కోసం ఎలాంటి మందూ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో శారీరక శ్రమ ద్వారానే శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ప్రయత్నించాలని సింధు పిలుపునిచ్చారు.
సోమవారం సింధు మాట్లాడుతూ... 'బలమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోడానికి క్రీడలు, శారీరక శ్రమ చాలా ముఖ్యం. ఇప్పటి వరకు టీకా, చికిత్స లేనందున కరోనాపై విజయం సాధించడానికి క్రీడలు ఉపయోగపడతాయి. గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్, కుంగుబాటు సమస్యలతో బాధపడేవారు వారంలో కనీసం 300 నిమిషాలు సాధారణ ఏరోబిక్ కసరత్తులు చేయాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ సూచనలను అంతా తప్పక పాటించాలి. ప్రతి ఒక్కరు రోజూ కనీసం 45 నిమిషాలు వ్యాయాయం చేయాల్సిందే' అని సింధు అన్నారు.
మరోవైపు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం బయటి గోడపై పీవీ సింధు 40 అడుగుల త్రీడీ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. సుందరీకరణలో భాగంగా అధికారులు నగరంలోని స్టేడియంతో పాటు పాఠశాలల గోడలపై క్రీడాకారులు, దేశనాయకులతో పాటు అవగాహన కల్పించే చిత్రాలను గీయిస్తున్నారు. చిత్రకారులైన విజయ్, స్వాతి దంపతులు ఈ త్రీడీ చిత్రాలను గీస్తూ ఔరా అనిపిస్తున్నారు. వీటిలో స్టేడియం వాల్పై గీసిన సింధు చిత్రం విశేషంగా అలరిస్తోంది.
మన దేశానికి చెందిన మాజీ ఆటగాళ్లను కోచ్లుగా మార్చుకునేందుకు లాక్డౌన్ రూపంలో మంచి అవకాశం దొరికిందని బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సింధు ఇటీవల అన్నారు. 'కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో విదేశీ కోచ్లు భారత్కు రావడం చాలా కష్టం. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన ఎందరో మాజీ ప్లేయర్లు మనకున్నారు. వారందరినీ కోచ్లుగా ఉపయోగించుకునేందుకు ఇదో మంచి అవకాశం' అని ఈ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిప్రాయపడ్డారు.
నీ సహచరులు సంబరాలు చేసుకుంటున్నారు.. ఇక్కడి నుంచి వెళ్లు: మాలిక్తో యువీ