హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రజత పతకం గెలవడం ఎంతో సంతోషంగా ఉందని భారత షట్లర్ పీవీ సింధు వ్యాఖ్యానించింది. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రజత, కాంస్య పతకాలు సాధించిన సింధు, సైనా నెహ్వాల్ కోచ్ గోపీచంద్లు మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో వారికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింధు, గోపీచంద్ తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ఫైనల్స్లో స్వర్ణం చేజారటంతో కొంచెం నిరాశ చెందానని చెప్పింది.
వరల్డ్ చాంపియన్షిప్లో ఇప్పటివరకు మూడు పతకాలు గెలిచానని వెల్లడించారు. తల్లిదండ్రులు, కోచ్ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో జరిగిన ఫైనల్ పోరు చాలా కఠినంగా సాగిందని సింధు పేర్కొంది. ఇక, ఫైనల్స్ మ్యాచ్ బాగా సాగిందని చెప్పుకొచ్చింది.
'హోరాహోరీగా జరిగిన పోరులో తృటిలో స్వర్ణాన్ని కోల్పోయా. అయినా నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. ప్రేక్షకుల నుంచి లభించిన మద్దతు మరువలేనిది. ఏదొక రోజు నేను ఫైనల్ మ్యాచ్ గెలిచి స్వర్ణ పతకం సాధిస్తా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మహిళా క్రీడాకారులకు మంచి సహకారం లభిస్తోంది. ఇకపై వచ్చే టోర్నీలన్నీ నాకు చాలా ముఖ్యం. వాటిలోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడమే లక్ష్యం' అని సింధు తెలిపింది. ప్రస్తుతం వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో సింధు నాలుగో ర్యాంకులో కొనసాగుతోంది.