హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రియో ఒలింపిక్స్లో భారతదేశం తరపున మొదటిసారిగా వెండిపతకాన్ని సాధించిన మహిళా క్రీడాకారిణి. మన దేశంలో క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే వారికి కాసుల వర్షం కురుస్తుందే సంగతి తెలిసిందే. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా తదితర క్రీడాకారులను ఇప్పటికే మనం చూశాం.
రియో ఒలింపిక్స్లో పతకం సాధించిన తర్వాత పీవీ సింధు కూడా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. అయితే పీవీ సింధు ఏదైనా బ్రాండ్కు ఒక్కరోజు ఎండార్స్ చేస్తే ఆ రోజుకి రూ. 1.25 కోట్లు పారితోషికంగా తీసుకుంటుందంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇదే గనుక నిజమైతే భారతీయ క్రీడాకారుల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కోహ్లీ తర్వాతి స్ధానం పీవీ సింధుతే అవుతుంది మరి. ఇక ప్రస్తుతం పీవీ సింధు ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో ఆడుతోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో దినార్ దియా అయుస్తిన్ (ఇండోనేసియా)పై 21-12, 21-4 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్లో ప్రవేశించింది.

ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ క్రికెటర్ కూడా సొంతం చేసుకోని వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. జర్మనీకి చెందిన స్పోర్ట్స్ లైఫ్స్టైల్ బ్రాండ్ పూమాతో ఎనిమిదేళ్ల కాలానికి రూ.110 కోట్లతో కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు.
తద్వారా దేశంలో ఒకే బ్రాండ్తో ఏకంగా రూ.100 కోట్ల ఒప్పందం చేసుకున్న తొలి భారత క్రీడాకారుడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఎనిమిది సంవత్సరాలకు గాను పూమాతో కోహ్లీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.
ఈ ఒప్పందంతో కోహ్లీ జమైకా పరుగుల వీరులు ఉసెన్బోల్ట్, అసఫా పోవెల్, ఫుట్బాల్ ఆటగాళ్లు థీయరీ హెన్రీ, ఆలివర్ గిరౌడ్ల సరసన చేరాడు. ఈ ఒప్పందం ప్రకారం కోహ్లీకి పూమా సంవత్సరానికి రూ.12 నుంచి రూ.14 కోట్లు ఆఫర్ చేసింది.