
టాప్లో పీవీ సింధు, ఉపాసనా కామినేని
ఉజ్వల భవిత కలిగిన శక్తిమంత సంపన్నుల్లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, హీరో రాంచరణ్ భార్య.. అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్ ఉపాసనా కామినేని కొణిదెలకు చోటు లభించింది. ఫోర్బ్స్ ఇండియా తొలిసారి ప్రకటించిన 'టైకూన్స్ ఆఫ్ టుమారో' అనే జాబితాలో వీరికి చోటు దక్కింది. ఇప్పటికే ఫోర్బ్స్ 100 జాబితాలో చోటు సంపాదించుకున్న యువ స్టార్ షట్లర్ తాజాగా భావి దిగ్గజంగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.


క్రీడా రంగం నుంచి సిందు ఒక్కరే:
వ్యాపారం, చిత్ర, క్రీడా రంగాల్లో 22 మంది యువ శక్తిమంతులతో రూపొందిన ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక కీడాకారిణి పీవీ సింధు కావడం గమనార్షం. కాగా ఈ జాబితాను ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేకంగా భారత్కు మాత్రమే రూపొందించింది. ఈ జాబితా రూపొందించేటప్పుడు నికర సంపదను ఆధారంగా తీసుకోలేదని సంస్థ తెలిపింది.

నటులతో పాటు వ్యాపారవేత్తల సంతానం
ఈ జాబితాలో.. అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కరణ్ అదానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా, జీరోధా వ్యవస్థాపకులు నిఖిల్ కామత్.. నితిన్ కామత్, ఓయో రూమ్స్ నుంచి రితేశ్ అగర్వాల్, బిర్లా వారసురాలు, యస్ బ్యాంక్ సీఈవో రాణా కపూర్ కుమార్తె రాధా కపూర్ ఖన్నా, నటులు విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్ తదితరులు చోటు దక్కించుకున్నారు.

బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో టాప్ టెన్
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత విజయవంతమైన షట్లర్గా సింధు కెరీర్ కొనసాగిస్తున్నది. నిలకడగా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో టాప్ టెన్లో కొనసాగుతూ.. చైనా, జపాన్ షట్లర్ల పోటీని తట్టుకుంటూ విజయాలను సాధిస్తున్నది. ఆర్జనతోపాటు ఆటలోనూ ఎదురులేకుండా దూసుకెళుతున్న సింధుకు ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో చోటు దక్కడం మరెంతో మంది యువ ప్లేయర్లకు స్ఫూర్తిదాయకం.


Click it and Unblock the Notifications
