బ్యాంకాక్: కరోనా మహమ్మారి సుదీర్ఘ విరామం తర్వాత బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆశించినమేర రాణించలేకపోతోంది. థాయ్లాండ్ ఓపెన్ సూపర్-1000తో తొలి అంతర్జాతీయ టోర్నీలో పోటీపడ్డ సింధు.. ఒత్తిడి తట్టుకోలేక తొలి రౌండ్లోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఓపెన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లింది. ఇక ఎన్నో అంచనాలతో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్లో బరిలోకి దిగిన తెలుగు తేజం మొదటి రౌండ్లోనే ఓటమిని ఎదుర్కొంది.
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్ గ్రూప్-బిలో పీవీ సింధుకు తొలి రౌండ్లోనే భారీ షాక్ తగిలింది. సింధు 21-19, 12-21, 17-21తో వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. 59 నిమిషాల పాటు జరిగిన పోరులో తొలి గేమ్ను సొంతం చేసుకున్న సింధు.. తర్వాతి రెండు గేమ్ల్లో ప్రత్యర్థి ధాటి ముందు నిలువలేకపోయింది. తొలి గేమ్లో ఓడిన తై జు యింగ్.. మిగిలిన రెండు తొలి గేమ్లలో పుంజుకోవడానికి సింధుకి అవకాశమే ఇవ్వలేదు. దీంతో సింధు ఓటమిపాలైంది.
ఇప్పటి వరకు తై జు యింగ్తో 21సార్లు తలపడిన పీవీ సింధు ఏకంగా 16 సార్లు ఓడిపోయింది. గ్రూప్-బిలో సింధు తన తర్వాతి మ్యాచ్లో స్థానిక క్రీడాకారిణి ఇంతానన్ రచనోక్ (థాయ్లాండ్)తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవలి థాయ్లాండ్ టోర్నోలో సింధును డెన్మార్క్కు చెందిన మియా బ్లిక్ఫీల్డ్ 21-16, 24-26, 13-21తో ఓడించింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్కు ముందు మ్యాచ్ ఫిట్నెస్ పరీక్షించుకోవాలని భావించిన సింధు గత కొద్దిరోజులుగా లండన్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.
పురుషుల సింగిల్స్ గ్రూప్-బిలో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్కు కూడా తొలి రౌండ్లోనే ఎదురుదెబ్బ తగిలింది. అండర్స్ ఆంటోన్సెన్ (డెన్ మార్క్) చేతిలో 21-15, 16-21, 18-21తో శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్ను కైవసం చేసుకున్న శ్రీకాంత్.. తర్వాతి రెండు గేమ్ల్లో తడబడి ప్రత్యర్థికి మ్యాచును సమర్పించుకున్నాడు.
కోహ్లీ, తమన్నాలకు కేరళ హైకోర్టు నోటీసులు!!