హైదరాబాద్: ప్రెంచ్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్లు క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లారు. మరో భారత షట్లర్ సైనా నెహ్వాల్ ప్రీ క్వార్టర్స్లోనే ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో రెండో సీడ్ సింధు 21-14, 21-13 స్కోరుతో వరుస గేముల్లో సయాక టకాహషి (జపాన్)ను ఓడించింది.
తొలి గేమ్లో తన ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనప్పటికీ సింధు విజయం సాధించింది. ఒకానొక దశలో 13-13తో స్కోరు సమమైంది. అయితే ఆ తర్వాత సింధు తనదైన శైలిలో విజృంభించి వరుసగా పాయింట్లు సాధించి 21-14తో తొలి గేమ్ను గెలుచుకుంది. ఇక రెండో గేమ్లో సింధు మరింత దూకుడుగా ఆడి మ్యాచ్ని సొంతం చేసుకుంది.

క్వార్టర్ ఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యూఫితో ప్రతీకార పోరుకు సింధు సిద్ధమైంది. ఇక సైనా నెహ్వాల్ 9-21, 21-23తో ఐదోసీడ్ అకానె యమగూచి (జపాన్) చేతిలో వరుస గేముల్లో ఓడింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21-19, 21-17తో వాంగ్ వింగ్ విన్సెంట్ (హాంకాంగ్)ను ఓడించాడు.
ఇక, సాయిప్రణీత్ 21-13, 21-17 స్కోరుతో కెంటా నిషిమోటొ (జపాన్)పై నెగ్గాడు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ ఓటమి పాలైంది. రెండో రౌండ్లో అశ్విని-సిక్కి 16-21, 14-21తో మిసాకి-అయాక (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్లో రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి క్వార్టర్ఫైనల్లో ప్రవేశించింది.