హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేసియా ఓపెన్ మహిళ సింగిల్స్లో సెమీఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో తన ప్రియతమ ప్రత్యర్థి స్పెయిన్ ప్లేయర్ కరోలిన్ మారిన్ను 22-20, 21-18 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. తొలి సెట్లో మరో రెండు పాయింట్లు సాధిస్తే మారిన్ గెలిచే స్థితిలో సింధు అద్భుతంగా పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి సెట్ను సొంతం చేసుకుంది. రెండో సెట్లో విజృంభించిన తెలుగు తేజం.. 12-6 తేడాతో ముందంజ వేసింది. తర్వాత ఆధిక్యాన్ని 14-15కి తగ్గించినప్పటికీ.. 21-18 తేడాతో సెట్ను సింధుకు కోల్పోయింది.
మరో పక్క ఇదే టోర్నీలో కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగిస్తున్నాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఫ్రాన్స్కి చెందిన బ్రైస్ లెవెర్డెజ్తో జరిగిన మ్యాచ్లో అలవోక విజయం అందుకున్న శ్రీకాంత్ సెమీస్లోకి అడుగుపెట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన శ్రీకాంత్.. 21-18, 21-14తో వరుస సెట్లలో విజయం సాధించాడు. భారత షట్లర్ దూకుడుతో కేవలం 39 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసిపోయింది.
తొలి సెట్ ఆరంభంలోనే 5-8తో వెనకబడిన శ్రీకాంత్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని 12-12తో బ్రైస్ని సమం చేశాడు. ఈ దశలో ఫ్రాన్స్ షట్లర్ వరుస తప్పిదాలు చేయడంతో.. ఒక్కసారిగా 17-14తో ఆధిక్యం సాధించిన శ్రీకాంత్.. అలవోకగా సెట్ని ముగించాడు. ఆ తర్వాత.. రెండో సెట్లో ఇద్దరూ నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో.. 5-5తో ఇద్దరూ సమంగా నిలిచిన దశలో బ్రైస్ మళ్లీ తడబడ్డాడు. దీంతో దూకుడు పెంచిన శ్రీకాంత్ 11-5తో ఆధిక్యాన్ని అందుకుని ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా మ్యాచ్ని గెలుపుగా ముగించాడు.
సెమీఫైనల్లో శ్రీకాంత్ జపాన్ ఆటగాడు, వరల్డ్ నంబర్ 2 కెంటో మొమొటాతో తలపడనున్నాడు. జపాన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ 2015లో కేసినో గ్యాంబ్లింగ్ కారణంగా కెంటోపై ఏడాది నిషేధం విధించింది. తర్వాత బరిలో దిగిన నాటి నుంచి మొమొటో అద్భుత ఫామ్లో ఉన్నాడు. గత ఏడాది డచ్ ఓపెన్, మకావు ఓపెన్లను గెలుపొందడంతోపాటు కెనడా ఓపెన్ ఫైనల్ చేరాడు. 2018 ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నాడు.