వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో నేడు భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అండర్గా డాగ్గా బరిలోకి దిగిన కిదాంబి శ్రీకాంత్ సెమీఫైనల్ చేరి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్కు తొలి పతకం ఖరారు చేయగా.. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పీవీ సింధు నిరాశపరిచింది. తన చిరకాల ప్రత్యర్థి అయిన చైనీస్ తైపికి చెందిన ప్రపంచనంబర్1 తైజు యింగ్ చేతిలోనే మరోసారి ఓడి సింధు నిరాశపరించింది. గత ఒలిపింక్స్ సెమీస్లో కూడా తైజుయింగ్ చేతిలోనే సింధు ఓడిన సంగతి తెలిసిందే.
తైజు యింగ్ చేతిలో మళ్లీ భంగపాటు
42 నిముషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో సింధు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే వెనకబడిన సింధు తొలి సెట్లో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 6-11తో వెనకబడంది. అనంతరం సింధు పుంజుకున్నపటికీ తైజు పెదగా అవకాశం ఇవ్వలేదు. చివరకు తైజు దూకుడుతో సింధు ఫస్ట్ సెట్ను 17-21తో కోల్పోయింది. దీంతో ఫస్ట్ సెట్ గెలవడం తైజుకు బలంగా మారింది. అనంతరం రెండో సెట్లో సింధు, తైజు హోరాహోరిగా తలపడ్డారు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి సింధు 8-11తో వెనుకబడింది.
అనంతరం సింధు కాస్త పుంజుకోని 12-12తో సమం చేసి తొలి సారి మ్యాచ్లోకి వచ్చింది. ఆ తర్వాత తైజు దూకుడు ముందు సింధు తేలిపోయింది. ఆ తర్వాత సింధు కేవలం ఒకే పాయింట్ సాధించింది. చివరకు రెండోసెట్ను కూడా 13-21తో కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది. సింధుపై తైజు తన అధిపత్యాన్ని కొనసాగిస్తూ మ్యాచ్ను 21-17, 21-13తో గెలుచుకోని సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. కాగా ఇప్పటివరకు సింధు, తైజు 20 సార్లు తలపడగా తైజు అత్యధికంగా 15 సార్లు గెలిచింది. సింధు 5 సార్లు మాత్రమే గెలిచింది. కాగా తైజు చేతిలో సింధుకు ఇది వరుసగా ఐదో ఓటమి.
పతకం ఖాయం చేసిన శ్రీకాంత్
సింధు నిరాశపరిచినప్పటికీ కిదాంబి శ్రీకాంత్ మాత్రం భారత అభిమానుల ఆశలను నిలబెట్టాడు. నెదర్లాండ్స్కు చెందిన మార్క్ కాల్జౌవ్ను 21-8, 21-7తో సునాయసంగా ఓడించి సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. అంతేకాకుండా ప్రపంచ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్కు తొలి పతకాన్ని ఖరారు చేశాడు. కాగా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో శ్రీకాంత్ పతకం గెలవడం ఇదే తొలిసారి. ఓవరాల్గా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్ పతకం గెలిచిన మూడో ఆటగాడిగా శ్రీకాంత్ నిలిచాడు.
శ్రీకాంత్ కంటే ముందు 1983లో ప్రకాష్ పదుకోణే, 2019లో సాయి ప్రణీత్ కాంస్య పతకాలు గెలిచారు. క్వార్టర్స్లో ప్రత్యర్థి కాల్జౌన్ను శ్రీకాంత్ కనీసం సింగిల్ డిజిట్ కూడా దాటనివ్వలేదు. తొలి సెట్లో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి 11-5తో అధిక్యంలో ఉన్న శ్రీకాంత్ తర్వాత సెట్ను 21-8తో గెలుచుకున్నాడు. రెండో సెట్ ఫస్ట్ హాఫ్లో 11-3తో అధిక్యంలో ఉన్న శ్రీకాంత్ చివరకు సెట్ను 21-7తో సునాయసంగా గెలుచుకున్నాడు.