హైదరాబాద్: రియో ఒలింపిక్ పతక విజేత, హైదరాబాదీ స్టార్ షట్లర్ పీవీ సింధు శనివారం ముంబైకి బయల్దేరింది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ విమానాశ్రయం గ్రౌండ్ స్టాఫ్లోని అజితేష్ అనే వ్యక్తి నుంచి తాను అవమానింపబడ్డానని సింధు చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్గా మారాయి.
ఈ విషయమై సింధు మొత్తం మూడు ట్వీట్లు చేసింది. అందులో అసలేం జరిగిందో చెప్పకుండా అజితేష్తో మాట్లాడితే ఏం జరిగిందో అతడే చెబుతాడంటూ ట్విట్టర్లో పేర్కొంది. సింధు శనివారం 6ఈ 608 విమానంలో ముంబైకు వెళ్తుండగా విమాన సిబ్బందిలోని అజితేశ్ అనే వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించాడు.

'గ్రౌండ్ స్టాఫ్ (స్కిప్పర్) మిస్టర్ అజితేశ్ నాతో చాలా అనాగరికంగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో(నాతో) సరిగ్గా మసులుకోమని ఎయిర్ హోస్టెస్ అషిమా అతడికి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతడు ఆమెతో కూడా అదేవిధంగా ప్రవర్తించడంతో నేను ఆశ్చర్యపోయా. ఇలాంటి వ్యక్తి సిబ్బందిగా ఉంటే ఇండిగో ఎయిర్లైన్స్ ఖ్యాతి దెబ్బతింటుంది' అని ఆమె పేర్కొంది.
దీంతో సింధు ట్వీట్లను చూసిన ఆమె అభిమానులు మాత్రం అజితేష్ను క్షమించాలని సలహా ఇస్తున్నారు. అతని ఉద్యోగం పోతుందని, నీ అంతటి స్టార్కు చేదు అనుభవాన్ని చూపినందుకు మరెక్కడా ఉద్యోగం లభించకుండా, అతని కుటుంబం రోడ్డున పడుతుందని ట్వీట్లలో పేర్కొన్నారు.
క్షమించి వదిలేస్తే సింధూ గొప్పతనం మరింతగా పెరుగుతుందని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ను డిలీట్ చేసి, అతనిపై ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
సింధు ట్వీట్పై స్పందించిన ఇండిగో ఎయిర్ లైన్స్
గ్రౌండ్ స్టాఫ్లోని అజితేష్ అనే వ్యక్తి తన పట్ల అనాగరికంగా ప్రవర్తించాడని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చేసిన ట్వీట్పై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. ప్రయాణికులు పట్ల తమ సిబ్బంది మర్యాదగానే నడుచుకున్నారని ఇండిగో ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ సిబ్బంది ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదని స్పష్టం చేసింది. కేవలం విధుల ప్రకారమే నడుచుకున్నారని ఎయిర్ లైన్స్ తెలిపింది.