
హైదరాబాద్: థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు సత్తా చాటింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో సింధు 23-21, 16-21, 21-9తో గ్రెగోరియా మరిస్కా తున్జంగ్పై విజయం సాధించి ఫైనల్కు చేరింది.
ఈ మ్యాచ్లో గ్రెగరియా సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. ఇద్దరి మధ్య తొలి గేమ్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ప్రతీ పాయింట్ కోసం ఇరువురి క్రీడాకారిణుల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన తొలి గేమ్ను సింధు స్వల్ప తేడాతో గెలుచుకుంది. చివర్లో గ్రెగరియా అనవసర తప్పదాలకు పాల్పడింది.
అనంతరం రెండో గేమ్ సింధు దూకుడుగా ప్రారంభించింది. కానీ, ఆ తర్వాత పుంజుకున్న గ్రెగోరియా రెండో గేమ్ను 21-16తో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్లో మాత్రం సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తన అనుభవంతో మూడో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది.
మూడో గేమ్లో సింధు మొదటి నుంచి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం సాధించింది. సింధు ధాటికి గ్రెగరియా చేతులెత్తేసింది. దీంతో సింధు 21-9తో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఆదివారం జరిగే ఫైనల్లో సింధు.. జపాన్ క్రీడాకారిణి ఒకుహారాతో తలపడనుంది.

బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్లో సింధుకు ఈ ఏడాది తొలి ఫైనల్ పోరు ఇదే కావడం విశేషం. వీరిద్దరూ ఇప్పటి వరకు పది సార్లు తలపడగా చెరో ఐదు సార్లు గెలిచారు. చివరిసారిగా వీరిద్దరూ ఈ ఏడాది మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్లో తలపడ్డారు. ఈ మ్యాచ్లో సింధు విజయం సాధించింది.