హైదరాబాద్: భారత్లో మరో కొత్త లీగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్), ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్), ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లను ప్రేక్షకులు విజయవంతంగా ఆదరిస్తోన్న తరుణంలో తెరపైకి కొత్తగా మరో లీగ్ దర్శనమిచ్చింది.
టీ20ల్లో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన కేవీ హరికృష్ణన్
దానిపేరు ప్రో వాలీబాల్ లీగ్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రొ వాలీబాల్ లీగ్ సీజన్-1 ప్రారంభం కానుంది. ఈ ప్రో వాలీబాగ్ లీగ్ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్గా రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, అమెరికన్ స్టార్ స్పైకర్ డేవిడ్ లీ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు.
ఈ మేరకు ప్రో వాలీబాల్ లీగ్ నిర్వాహకులు అధికారిక ప్రకటన చేశారు. శుక్రవారం ముంబైలో ప్రొ వాలీబాల్ లీగ్కు సంబంధించిన ప్రచార వీడియో కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ "నా తల్లిదండ్రులు రమణ, విజయ వాలీబాల్ ఆటగాళ్లు కావడంతో చిన్నప్పటి నుంచి ఈ ఆట అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ ప్లేయర్లతో కలిసి ఆడేందుకు భారత ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం" అని తెలిపింది.
ఇక, రెండుసార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన డేవిడ్ లీ మాట్లాడుతూ "భారత్లో వాలీబాల్ అభివృద్ధికి ఈ లీగ్ ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేను అనేక లీగ్లలో పాల్గొన్నాను. ఇప్పుడు అది ఇక్కడ కూడా కొనసాగేందుకు ప్రయత్నిస్తా" అని అన్నాడు. ఈ లీగ్లో భారత వాలీబాల్ కెప్టెన్ మోహన్ ఉగ్రపాండియన్తోపాటు ప్రముఖ ఆటగాళ్లు రంజిత్ సింగ్, అఖిన్ జాస్, దీపేష్ సిన్హా, గురిందర్ సింగ్, ప్రభాకరన్ పాల్గొనున్నారు.