మలేషియా ఓపెన 2026 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి, మాజీ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలవ్వడంతో ఈ టోర్నీలో భారత సవాల్ కూడా ముగిసినట్లు అయింది.
పోరాడి ఓడిన సింధు
క్వార్టర్ ఫైనల్లో ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో నేరుగా సెమీస్కు చేరిన పీవీ సింధుకు.. సెమీ ఫైనల్లో ప్రపంచ రెండో నంబర్ క్రీడాకారిణి వాంగ్ జీ యీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో చైనా క్రీడాకారిణి 21-16, 21-15 తేడాతో సింధుపై విజయం సాధించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 18వ స్థానంలో ఉన్న సింధు.. టాప్ ర్యాంకర్ వాంగ్కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది.

మ్యాచ్ సాగిందిలా..
తొలి గేమ్లో ఇద్దరు క్రీడాకారిణులు పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. ఒక దశలో స్కోరు 14-14తో సమంగా ఉంది. అయితే కీలక సమయంలో సింధు కొన్ని అనవసర తప్పిదాలు చేయడంతో వాంగ్ ఆధిక్యంలోకి వెళ్లి 21-16తో గేమ్ను గెలుచుకుంది. రెండో గేమ్లోనూ సింధు అద్భుత పునరాగమనం చేసింది. ముందుగా వెనుకబడినప్పటికీ పట్టుదలతో ఆడి స్కోరును 13-13 వద్ద సమం చేసింది. కానీ చివరి నిమిషాల్లో వాంగ్ తన దూకుడును ప్రదర్శించి వరుస పాయింట్లు సాధించడంతో సింధుకు ఓటమి తప్పలేదు. పీవీ సింధు నిష్క్రమణతో మలేషియా ఓపెన్లో భారత్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ విజయంతో వాంగ్ జీ యీ ఫైనల్కు దూసుకెళ్లింది.