న్యూ ఢిల్లీ: సైనా అవుటైన వేళ సింధు శుభారంభాన్ని నమోదు చేసింది. చైనా ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు శుభారంభం సాధించింది. ఈ టోర్నీలో మూడో సీడ్గా బరిలోకి దిగిన సింధు.. తొలి రౌండ్లో జపాన్కు చెందిన కవకమిపై 21-15, 21-13తో విజయం సాధించింది. దీంతో సింధు ప్రీక్వార్టర్స్కు దూసుకెళ్లింది.
అయితే ఇదే టోర్నీలో ఆడిన మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిరాశపరిచింది. తొలి రౌండ్లో కొరియాకు చెందిన సుంగ్ జి హ్యూన్తో తలపడిన సైనా.. 22-20, 8-21, 14-21తో ఓటమి చవిచూసింది. తొలి గేమ్లో హోరాహోరీగా తలపడిన సైనా.. రెండో గేమ్లో మాత్రం హ్యూన్ను నిలువరించలేకపోయింది.
ఇక గెలుపును నిర్ణయించే మూడో గేమ్లోనూ తడబడిన సైనా.. తొలి రౌండ్లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2014లో సైనా చైనా ఓపెన్ టైటిల్ను దక్కించుకుంది. ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది.
ఇక పురుషుల డబుల్స్లో మను అత్రి - సుమీత్ రెడ్డీ జోడీ రెండో రౌండ్కు దూసుకెళ్లింది. తొలి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన మిన్ చున్- చింగ్ హెంగ్పై మను అత్రి - సుమీత్ జోడీ 13-21, 21-13, 21-12తో విజయం సాధించింది.