రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దూసుకెళ్తోంది. మలేషియా మాస్టర్స్లో గురువారం చైనాకు చెందిన జాంగ్ యి మాన్పై వరుస గేమ్లలో విజయం సాధించి క్వార్టర్ఫైనల్కు చేరుకుంది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ పోరులో పూర్తి ఆధిపత్యం చలాయించిన పీవీ సింధు ధాటికి జాంగ్ యి మాన్ తేలిపోయింది. ప్రపంచ ఏడో సీడ్ అయిన పీవీ సింధు రెండో రౌండ్లో ప్రపంచ నంబర్ 32 అయిన యి మాన్ వరుస సెట్లలో 21-12 21-10తో గెలుపొందింది. కేవలం 28 నిమిషాల్లో విజయ లాంఛనాన్ని ముగించింది.
ఇక క్వార్టర్ ఫైనల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన సింధుకు గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రత్యర్థి అయిన చైనీస్ తైపీకి చెందిన తాయ్ ట్జు యింగ్తో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. గత వారం మలేషియా ఓపెన్లో క్వార్టర్ఫైనల్స్లో పీవీ సింధును ఓడించిన ప్రపంచ నం. 2 అయిన తాయ్ ట్జు యింగ్ను పీవీ సింధు నిలువరించగలిగితే.. సెమీస్, ఫైనల్లోకి వెళ్లడానికి మరిన్ని అవకాశాలుంటాయి. ఇక తాయ్ ట్జు యింగ్, సింధు మధ్య 21 మ్యాచ్లు జరుగగా.. మన సింధు 5-16తో ఆమెకంటే హెడ్-టు-హెడ్ రికార్డులో వెనకబడి ఉంది.
ఇక పురుషుల సింగిల్స్ పోటీలో బి.సాయి ప్రణీత్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. చైనాకు చెందిన లీ షే ఫెంగ్ చేతిలో 14-21, 17-21పాయింట్లతో ఓడిపోయాడు. 42నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ప్రణీత్ చివర్లో తడబడ్డాడు. ఇకపోతే హెచ్ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్లు సెకండ్ రౌండ్లో ఆడాల్సి ఉంది. ఇక నిన్న సైనా నెహ్వాల్ సైతం తొలి రౌండ్లోనే ఓడిపోయి ఇంటి బాట పట్టిన సంగతి తెలిసిందే.