ఇండోనేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. తొలి రౌండ్లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి వెన్ చి చేతిలో 15-21, 21-16, 14-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ప్రపంచ 26వ ర్యాంకర్ వెన్ చి చేతిలో వరల్డ్ 12వ ర్యాంకర్ సింధుకు ఇదే తొలి పరాజయం.
అంతకుముందు ఆడిన మూడు మ్యాచ్ల్లో వెన్ చిని మట్టికరిపించిన సింధు బుధవారం ఓటమిపాలైంది. తొలి గేమ్ను కోల్పోయిన సింధు రెండో గేమ్లో గొప్పగా పుంజుకుంది. కానీ నిర్ణయాత్మక మూడో గేమ్లో తడబడింది. అనవసరం తప్పిదాలతో మ్యాచ్ను కోల్పోయింది. 70 నిమిషాల పాటు సింధు-వెన్ చి ఫైట్ కొనసాగింది.

మహిళల సింగిల్స్లో మరో భారత క్రీడాకారిణి ఓటమిపాలైంది. ఆకర్షి కశ్యప్ కూడా మొదటి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. థాయ్లాండ్ షట్లర్ రచనోక్ చేతిలో 18-21, 6-21తో ఘోరపరాజయాన్ని చవిచూసింది. తొలి గేమ్లో గట్టి పోటీనిచ్చిన ఆకర్షి రెండో గేమ్లో ప్రత్యర్థికి దాసోహమైంది. మహిళల డబుల్స్లో భారత్ శుభారంభం చేసింది. అశ్వినీ పొన్నప్ప-తనీషా జోడీ ప్రిక్వార్టర్స్కు చేరింది.
తొలి రౌండ్లో కెనడా జంట జాకీ డెంట్ - క్రిస్టల్ను అశ్వినీ-తనీషా ద్వయం 21-15, 21-15తో వరుస గేమ్ల్లో చిత్తు చేసింది. కాగా, కొరియా జోడీ సో యోంగ్ కిమ్- హీ యోంగా కాంగ్ పై రుతు పర్ణ- శ్వేత పర్ణ 12-21, 9-21 తేడాతో ఓటమిపాలైంది.