
బాసెల్: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను సింధు గెలుచుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై 21-7, 21-7 తేడాతో ప్రపంచ ఇదో ర్యాంకర్ సింధు ఘన విజయం సాధించింది. ఒకుహరను వరుస సెట్లలో చిత్తు చేసిన సింధు స్వర్ణం గెలిచింది. దీంతో 2017 ప్రపంచ చాంపియన్షిప్లో భాగంగా ఒకుహారాతో జరిగిన ఫైనల్ పోరులో ఓటమి పాలైన సింధు ప్రతీకారం తీర్చుకుంది.
ఏకపక్షంగా సాగిన తొలి గేమ్ను సింధు అలవోకగా సొంతం చేసుకుంది. ఒకుహర తొలి పాయింట్ సాధించినా.. ఆ తర్వాత సింధు రెండో పాయింట్ నుంచి వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించింది. ఈ దశలో ఒకుహర రెండో పాయింట్ సాధించి ఆధిపత్యం కొనసాగించాలని చూసింది. కానీ.. ఎలాంటి అవకాశం ఇవ్వని సింధు 16 పాయింట్ల వరకు ఆధిపత్యం కొనసాగించింది. అనంతరం ఒకుహర రెండు పాయింట్లు సాధించానా.. సింధు చెలరేగి 21-7తో తొలి గేమ్ సాధించింది.
రెండో గేమ్నూ సింధు అదే జోరును కొనసాగించింది. ఒకుహరకు అసలు పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. సింధు కొట్టే స్మాష్లకు ప్రత్యర్థి దగ్గర సమాధానమే లేకపోయింది. గేమ్ ఆది నుంచే పాయింట్లు సాధిస్తూ ఒకుహరపై పూర్తి ఆధిపత్యం సాధించి 21-7తో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. వరుసగా మూడుసార్లు ఫైనల్కు చేరిన సింధు .. ఈసారి స్వర్ణం కైవసం చేసుకుంది. నాలుగు దశాబ్దాలుగా ఊరించిన భారత పసిడి కలను సింధు నెరవేర్చింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సింధు అందుకుంది. గతంలో పాల్గొన్న ఐదు ప్రపంచ చాంపియన్షిప్లలో నాలుగు పతకాలు గెలుచుకుంది.