భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పి.వి.సింధు ఇటీవల రాణించలేకపోతోంది. ఫామ్లో లేని ఆమె మలేషియా ఓపెన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండియా ఓపెన్లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఈ టోర్నీ తొలి రౌండ్లోనే సింధు ఓటమి చవిచూసింది. ప్రపంచ 7వ ర్యాంక్ అయిన సింధును 30వ ర్యాంక్ అయిన సుపనిధా కటేథాంగ్ ఓడించింది. తొలి సెట్లో 14-21 తేడాతో ఓడిన సింధు.. రెండో సెట్లో కొంత పోరాడింది. కానీ ఆ సెట్లో కూడా సుపనిదా 22-20 తేడాతో సింధును ఓడించి, టోర్నీలో ముందడుగు వేసింది. తొలి మ్యాచ్లోనే ఓడిన సింధు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అయితే ఇదే టోర్నీలో ఇతర ప్లేయర్లు సైనా నెహ్వాల్, లక్ష్యసేన్తోపాటు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, గాయత్రి గోపీచంద్-త్రీసా జాలీ జోడీలు ముందంజ వేయడం గమనార్హం. అదే సమయంలో సిక్కి రెడ్డి-శ్రుతి మిశ్రా జోడి ఓటమి పాలైంది. మాజీ చాంపియన్ అయినా సైనా నెహ్వాల్.. డెన్మార్క్ క్రీడాకారిణి మియా బ్లిచ్ఫెల్ట్ను ఓడించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో 21-17, 12-21, 21-19తో సైనా గెలుపొందింది. మరో స్టార్ ప్లేయర్ లక్ష్య సేన్.. భారత్కే చెందిన హెచ్ ఎస్ ప్రణయ్ను చిత్తుగా ఓడించాడు. ప్రణయ్ను వరుస సెట్లలో చిత్తుగా ఓడించిన లక్ష్య సేన్.. మలేషియా ఓపెన్లో ప్రణయ్ చేతిలో పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీక కూడా అద్భుతంగా రాణించి 21-13, 21-15తో స్కాట్లాండ్ జోడి క్రిస్టొఫర్ గ్రిమ్లే-మాథ్యూ గ్రిమ్లేపై గెలుపొందగా, గాయత్రి-త్రీసా 22-20, 17-21, 21-18తో ఫ్రాన్స్కు చెందిన మార్గొట్ లాంబర్ట్, అన్నె ట్రాన్ను ఓడించారు. సిక్కిరెడ్డి-శ్రుతి 17-21, 21-18తో జర్మనీకి చెందిన లిండా ఇఫ్లర్-ఇసబెల్ లోహవ్ చేతిలో ఓటమిపాలయ్యారు.