మలేసియా ఓపెన్లో భారత అభిమానులకు షాక్ తగిలింది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొల రౌండ్లోనే ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆమె తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టింది. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన సింధు ఇలా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇదే టోర్నీలో భారత క్రీడాకారులు హెచ్ఎస్ ప్రణయ్, సాత్విక్ జోడీ ప్రీక్వార్టర్స్లో అడుగు పెట్టింది.
మహిళల సింగిల్స్ విభాగంలో సింధు పోటీ పడింది. ఆరో సీడ్ అయిన సింధు.. స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్తో తలపడింది. ఈ మ్యాచ్లో 12-21, 21-10, 15-21తో ఓడిన సింధు ఇంటి దారి పట్టింది. ఇంతకుముందు కామన్వెల్త్ క్రీడల సమయంలో సింధు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగా కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకున్న ఆమె.. మలేషియా ఓపెన్లో తొలిసారి బరిలో దిగింది. ఈ టోర్నీలో తను ఆడినత తొలి మ్యాచ్లోనే ఓటమి పాలవడం గమనార్హం.
ఈ మ్యాచ్లో తొలి గేమ్లోనే ఓడిన ఆమె.. ఆ ఓటమిని పక్కన పెట్టి రెండో గేమ్లో అద్భుతంగా ఆడింది. ప్రత్యర్థికి దీటుగా బదులిచ్చింది. కానీ, నిర్ణయాత్మక మూడో గేమ్లో మారిన్ జోరు పెంచడంతో సింధు వెనకడుగు వేయాల్సి వచ్చింది. సింధుతోపాటు మరో భారత క్రీడాకారిణి మాళవిక భన్సోడ్ కూడా ఓటమి చవిచూసింది. కొరియాకు చెందిన అన్ సి యంగ్ చేతిలో 9-21, 13-21తో వరుస గేమ్స్ కోల్పోయి ఓడిపోయింది. పురుషుల సింగిల్స్లో ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య జరిగిన మ్యాచ్లో 22-24, 21-12, 21-18 తేడాతో ఏడో సీడ్ లక్ష్య సేన్ను ప్రణయ్ ఓడించాడు. డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ.. కొరియాకు చెందిన చోయ్ సోల్ గ్యూ-కిమ్ వోన్ హోపై 21-16, 21-13తో ఘనవిజయం సాధించింది.