హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్లో అడుగుపెట్టడం ఎంతో గర్వంగా ఉందని తెలుగు తేజం పీవీ సింధు పేర్కొంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత మహిళల క్వార్టర్స్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై 20-22, 21-18, 21-18 తేడాతో గెలిచి సెమీస్కు చేరుకున్న సంగతి తెలిసిందే.
సాహో సింధు: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో ఒకుహరాపై గెలిచి సెమీస్కు
మ్యాచ్ అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ 'గేమ్ హోరాహోరీగా సాగుతుందని ముందే తెలుసు. పాయింట్లు అంత సులువుగా దక్కుతాయని అనుకోలేదు. పక్కా వ్యుహంతోనే బరిలోకి దిగాను. ప్రతి పాయింట్ కోసం కష్టపడాల్సి వచ్చింది. మొదటి సెట్ కోల్పోయి తిరిగి పుంజుకుని వరుస సెట్లలో గెలువడం సంతోషాన్నిచ్చింది' అని తెలిపింది.
'టోర్నీలో తొలిసారి సెమీఫైనల్లో అడుగుపెట్టడం గర్వంగా ఉంది. క్వార్టర్స్తోనే పోరాటం పూర్తి కాలేదు. శనివారం నాటి యమగుచితో సెమీఫైనల్ మ్యాచ్కు వందశాతం శక్తిసామర్థ్యాలతో సిద్ధమవుతాను' అని సింధు వెల్లడించింది. తాజా విజయంతో సింధు-ఒకుహరా ముఖాముఖి పోరు 5-5తో సమమైంది.
ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలోనే అతి పురాతన సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో సింధు తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగే సెమీ ఫైనల్లో జపాన్ షట్లర్ అకానే యమగుచితో సింధు తలపడనుంది. 84 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సింధు తన జోరుని ప్రదర్శించింది.