
హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధిస్తుందని మాజీ వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు పీటర్ గాడే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను భారత పర్యటనకు వచ్చిన అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
భారత పర్యటనలో భాగంగా ఓ జాతీయ మీడియా ఛానెల్తో మాట్లాడాడు. '2020 టోక్యో ఒలింపిక్స్లో పీవీ సింధు తప్పక స్వర్ణం సాధిస్తుంది, ఆమెలో ఆ సత్తా ఉంది' అని పీటర్ గాడే అన్నారు. ఇక భారత పురుష షట్లర్లపై కూడా ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు.
'పురుషుల సింగిల్స్లో కూడా భారత షట్లర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. త్వరలో కిదాంబి శ్రీకాంత్ కూడా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధిస్తాడు. అగ్రస్థానాన్ని అందుకోవడానికి అతనికి చాలా గట్టి పోటీ ఎదురవుతోంది. భారత్ కూడా చైనా, జపాన్, ఇండోనేషియా, డెన్మార్క్ వలె సూపర్ పవర్లా ఎదిగే అవకాశం ఉంది' అని అన్నారు.
భారత్లో ప్రతిభ కలిగిన కోచ్లతో పాటు అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారని అన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్లో చైనా ఆధిపత్యం మాత్రం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని పీటర్ గాడే వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే 2016లో రియో వేదికగా జరిగిన ఒలింపిక్స్లో పీవీ సింధు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.