టోక్యో: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో రెండు వ్యక్తిగత పతకాలను గెలిచిన మొదటి భారతీయ మహిళాగా రికార్డుల్లోకి ఎక్కింది. జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ 2021లో ఆదివారం సింధు కాంస్య పతకం గెలుచుకుంది. చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో జరిగిన మ్యాచులో 21-13, 21-15 తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు 2016 రియో ఒలింపిక్స్లో సింధు రజతం గెలుచుకుంది. మరోవైపు భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజతం గెలుచుకున్న విషయం తెలిసిందే.
బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో కఠినమైన చైనా ప్రత్యర్థి హి బింగ్జియావోపై తొలి గేమ్ నుంచే తెలుగు తేజం పీవీ సింధు పైచేయి సాధిస్తూ వచ్చింది. ఎక్కడా కూడా బింగ్జియావోకు అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్లో విరామ సమయానికి 11-8తో నిలిచిన సింధు.. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి ప్రత్యర్థిని కట్టడి చేసింది. ఓ దశలో వరుస నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అనంతరం కూడా వరుసగా పాయింట్లు సాధిస్తూ చైనా క్రీడాకారిణి బింగ్జియావోని ఒత్తిడిలోకి నెట్టింది. ఈ క్రమంలోనే తొలి గేమ్ను 21-13తో సింధు కైవసం చేసుకుంది.
ఇక రెండో గేమ్ ప్రారంభంలో కూడా పీవీ సింధూనే దూకుడు ప్రదర్శించింది. మధ్యలో బింగ్జియావో గట్టిగా పోరాడేందుకు చూసినా సింధు ఆధిక్యంలోకి వెళ్లనివ్వలేదు. దాంతో విరామ సమయానికి మళ్లీ 11-8తో నిలిచింది. ఈ క్రమంలోనే చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో భారత షట్లర్ 21-15తో విజయం సాధించింది. దాంతో వరుసగా రెండు ఒలింపిక్స్ల్లోనూ వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. మ్యాచ్ 52 నిమిషాల పాటు సాగింది.
శనివారం జరిగిన సెమీస్ పోరులో చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్ చేతిలో 18-21, 12-21తేడాతో పీవీ సింధు ఓటమిపాలైంది. దీంతో భారత్ స్వర్ణ పతక ఆశలు ఆవిరయ్యాయి. ఇక ఆదివారం కాంస్యం కోసం జరిగిన మరో ఆసక్తికర పోరులో బింగ్జియావోపై సింధు ఘన విజయం సాధించింది. సింధు కంటే ముందు రెజ్లర్ సుశీల్కుమార్ మాత్రమే ఒలింపిక్స్లో భారత్ తరఫున రెండు మెడల్స్ గెలిచాడు. సుశీల్కుమార్ 2008 గేమ్స్లో బ్రాంజ్, 2012 గేమ్స్లో సిల్వర్ మెడల్ గెలిచాడు.
Tokyo Olympics 2021: రింగ్ వద్ద బాక్సర్ నిరసన.. కారణం ఏంటంటే?