
హైదరాబాద్: ప్రస్తుతం భారత్లో బయోపిక్ చిత్రాల హవా కొనసాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్లో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్రలు తెరపై కనువిందు చేశాయి. పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ వంటి స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లను తయారు చేసిన కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా త్వరలో సినిమా తీసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
గోపీచంద్ జీవితం ఆధారంగా సినిమా తీసేందుకు ఫాక్స్ స్టార్ స్టుడియో, అబండాన్షియా ఎంటర్టైన్మెంట్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. గోపీచంద్ 44వ జన్మదినం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తరణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ తన జీవిత గాథను సినిమాగా రూపొందించనుండడం గర్వంగా ఉందన్నాడు. గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందిన సైనా నెహ్వాల్, పీవీ సింధులపై ఇప్పటికే సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే.
2018 మే నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది. గోపీచంద్ పాత్రలో తెలుగు నటుడు సుధీర్బాబు టైటిల్రోల్ పోషించే అవకాశం ఉంది.