హైదరాబాద్: తన జీవితకథ ఆధారంగా తీస్తున్న సినిమా కోట్లాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని రియో ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు చెప్పింది. నటుడు, నిర్మాత సోనూ సూద్.. సింధు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ఈ విషయమై సింధు తొలిసారి స్పందించింది.
'సోనూ సూద్ టీమ్ నా బయోపిక్ నిర్మించడానికి ముందుకు వచ్చింది. గత ఎనిమిది నెలలుగా వాళ్లు ఎంతో రీసెర్చ్ చేశారు. నా బయోపిక్ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నాను' అని పీవీ సింధు సంతోషంగా చెప్పింది. కాగా, సింధు పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పదుకుణె నటిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో సిల్వర్ మెడల్ సాధించిన పీవీ సింధు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ నటుడు సోనూ సూద్... సింధు జీవితకథ ఆధారంగా సినిమా తీసేందుకు ముందుకొచ్చారు. సింధుపై బయోపిక్ తీయాలని ఉందని, లక్షల మంది భారతీయ మహిళలకు ప్రేరణగా నిలిచిన అమ్మాయి సింధు అని చెప్పారు.
సింధు హార్డ్ వర్క్ ద్వారా అద్భుత ఘనతను సాధించిందని, షట్లర్ సింధు ప్రగతిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశమని ఈ సందర్భంగా సోనూ సూద్ అన్నారు. సింధు ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే బ్యాడ్మింటన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఆమె పుల్లెల గోపిచంద్ అకాడమీలో ఆమె శిక్షణ పొందుతోంది.