
హైదరాబాద్: ప్రస్తుతం తన దృష్టంతా వరల్డ్ చాంపియన్షిప్, ఆసియా గేమ్స్పైనే ఉందని భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్లో ప్రణయ్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే.
గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో సెమీ పైనల్ వరకు దూసుకెళ్లిన ప్రణయ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. అయితే, మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీసే ఈ ఫలితాన్ని తాను సమీక్షించే పరిస్థితిలోలేనని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా ప్రణయ్ మాట్లాడుతూ "మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీసే గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ లాంటి ప్రతికూల ఫలితాలను సమీక్షించే మూడ్లో లేను. ఇప్పుడు నా ఏకాగ్రత అంతా వరల్డ్ చాంపియన్షిప్, ఆసియా గేమ్స్పైనే. ఓడినోడిపై విమర్శలు రావడం సహజం" అని అన్నాడు.
"కానీ, ఎలాంటి రిస్క్లు ఫేస్ చేయాలన్నది మనకే తెలుస్తుంది. నేనేంటో నాకు తెలుసు. ఫలితం సాధించినపుడే నేనేంటో బయటివాళ్లకు తెలిసేది. అందుకే నా ఫోకస్ టోర్నీలపైనే పెట్టాను" అని ప్రణయ్ పేర్కొన్నాడు. ఇటీవలే ముగిసిన ఇండోనేషియా ఓపెన్లో ప్రణయ్ సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రణయ్ 21-15, 9-21, 21-14 తేడాతో ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ లిన్ డాన్(చైనా)పై విజయం సాధించాడు. ఎనిమిదవ సీడ్గా బరిలోకి దిగిన హెచ్ఎస్ ప్రణయ్ 59 నిమిషాల పోరులో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. మొదటి గేమ్ను గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్లో భారీ తేడాతో ఓడాడు.
ఆ తర్వాత జరిగిన నిర్ణయాత్మక మూడో గేమ్లో ప్రణయ్ అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. లిన్ డాన్పై ప్రణయ్కు ఇది రెండో విజయం కావడం విశేషం. ఈ ఇద్దరూ ఇప్పటివరకూ మూడుసార్లు తలపడితే రెండు సార్లు ప్రణయ్నే విజయం వరించింది. మూడు సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరూ తలపడటం ఇదే మొదటిసారి.
దీనిపై ప్రణయ్ మాట్లాడుతూ "నిజంగా ఇది చక్కటి శుభారంభం, గాయం తర్వాత ఇలాంటి ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది. లిన్ డాన్ తనలోని అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. ఇటీవల కాలంలో యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వయసు కారణంగా లిన డాన్ స్పీడ్ని కోల్పోయాడు. కెంటో మొమొటా, షి యుకీ దూకుడుగా ఆడుతున్నారు" అని అన్నాడు.