
కోచింగ్ సెషన్లో అశ్లీల చిత్రాలు:
భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్), భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)లు సంయుక్తంగా ఆన్లైన్ కోచింగ్ సెషన్ నిర్వహిస్తోంది. దీంట్లో దేశ వ్యాప్తంగా 700 మందికి పైగా కోచ్లు పాల్గొని.. సీనియర్లు చెప్పే క్లాసులను శ్రద్ధగా వింటున్నారు. 700 మందికి చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్.. ఇండోనేసియా కోచ్లు అగుస్ దివి సాంటోసో, నమ్రి సురోటో మార్గనిర్దేశకం చేస్తున్నారు. కోచ్ సాంటోసో క్లాస్ చెపుతుండగా.. ఒక్కసారిగా స్ర్కీన్పై అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు.

గోపీచంద్ లాగౌట్:
ఆన్లైన్ కోచింగ్ సెషన్లో తరచుగా అలాంటి చిత్రాలే వస్తుండడంతో.. లైవ్లో ఉన్న పుల్లెల గోపీచంద్ వెంటనే లాగౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక్కొకరుగా లాగౌట్ అవ్వడంతో సెషన్కు అంతరాయం కలిగింది. గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరగగా.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సెషన్లో మహిళా కోచ్లు కూడా ఉన్నారని, ఇది చాలా ఇబ్బంది కలిగించిందని సెషన్లో పాల్గొన్న ఓ కోచ్ తెలిపాడు.

'జూమ్' వీడియో కాల్ యాప్ ద్వారా:
కరోనా కారణంగా 21 రోజుల పాటు బాయ్, సాయ్ ఈ ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాడొద్దని సూచించిన 'జూమ్' వీడియో కాల్ యాప్నే వీరూ వినియోగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆన్లైన్ సెషన్ హ్యాక్ కాలేదని 'సాయ్' పేర్కొంది. సాంకేతిక సమస్య వల్ల ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని సాయ్, బెంగళూరు శాఖ తెలిపింది. అయితే దీనిపై సాయ్ ఐటీ డిపార్ట్మెంట్ విచారణ చేస్తోంది. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి.


Click it and Unblock the Notifications












