
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)నాలుగో సీజన్లో ముంబై రాకెట్స్ సెమీస్కు దూసుకెళ్లింది. శనివారం ముంబై 5-0 తేడాతో చెన్నైపై గెలిచింది. తొలి మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో ఆండ్రెస్ యాంటన్సెన్ 15-14, 15-11తో రాజీవ్ ఓసెఫ్పై గెలిచి ముంబైకి శుభారంభం అందించాడు. మిక్స్డ్ డబుల్స్లో కిమ్ జి జంగ్-పయా బెర్నాడ్త్ జోడీ 15-14, 15-14తో క్రిస్ ఎడ్కాక్-గాబ్రియెల్ ఎడ్కాక్ జంటపై నెగ్గింది. ఈ మ్యాచ్ను చెన్నై ట్రంప్గా ఎంచుకోవడంతో ఓ పాయింట్ కోతకు గురైంది.
ఇదిలా ఉంచితే.. మహిళల సింగిల్స్లో సన్ జి హ్యూన్ 15-7, 15-8తో అనురాపై గెలిచి చెన్నైకి తొలి పాయింట్ తెచ్చిపెట్టింది. కానీ, ట్రంప్ మ్యాచ్ ఓడడంతో ఆ పాయింట్ కూడా కోల్పోయింది. ముంబై ట్రంప్ మ్యాచ్గా ఎంచుకొన్న పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ 12-15, 15-13, 15-9తో కశ్యప్పై గెలిచి జట్టుకు విజయాన్ని తెచ్చి పెట్టాడు. అంతకంటే ముందు చెన్నై ట్రంప్ మ్యాచ్గా ఎన్నుకొన్న మిక్స్డ్ డబుల్స్లోనూ ముంబై గెలిచింది.
పురుషుల డబుల్స్లో రాకెట్స్ జోడీ కిమ్ జి జుంగ్-లీ యోంగ్ డే 15-8, 15-10తో సుమీత్ రెడ్డి-చిన్ చుంగ్పై నెగ్గింది. కెప్టెన్ సైనా నెహ్వాల్ నెగ్గినా నార్త్ ఈస్ట్రన్ వారియర్స్కు ఓటమి తప్పలేదు. నార్త్ ఈస్ట్రన్ వారియర్స్ 3-4తో బెంగళూరు ర్యాప్టర్స్ చేతిలో ఓడింది. ట్రంప్గా ఎంచుకున్న మహిళల సింగిల్స్లో సైనా 15-10, 15-7తో టి ర్యాంగ్ వూపై నెగ్గి రెండు పాయింట్లు అందించింది. పురుషుల డబుల్స్ను బెంగళూరు ట్రంప్గా ఎంచుకోగా.. అహ్సాన్-సెథియవాన్ జంట 15-14, 15-11తో లి మిన్ చుంగ్-యొ యి సెయింగ్పై నెగ్గి 2-0 ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది.
పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ 15-11, 15-12తో తనోంగ్సన్ సయిన్సోంబూమ్సన్పై నెగ్గి ర్యాప్టర్స్కు మరో పాయింట్ అందించాడు. ట్రంప్ మ్యాచ్ను నెగ్గిన సైనా.. వారియర్స్ను 2-3తో నిలిపింది. పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ 12-15, 15-6, 15-7తో టియాన్ హో వీను ఓడించి 4-2తో బెంగళూరును గెలిపించాడు. మిక్స్డ్లో మిన్ చున్-కిమ్ జోడీ 15-11, 15-9తో లారెన్-మార్కస్పై గెలిచి వారియర్స్కు ఓదార్పు పాయింట్ అందించింది. ఈ విజయంతో సెమీస్ బెర్త్కు బెంగళూరు మరింత చేరువైంది.