హైదరాబాద్: స్టార్ ప్లేయర్ బీవెన్ జాంగ్కు భారత యువ షట్లర్ రితుపర్ణ దాస్ షాక్ ఇవ్వడంతో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో పుణె సెవెన్ ఏసెస్ సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. ఇప్పటికే చెన్నై సూపర్ స్టార్స్, నార్త్ ఈస్ట్రన్ వారియర్స్ సెమీస్ చేరగా.. పుణె మూడో జట్టుగా నిలిచింది. జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్లో పుణే 4-1తో అవధె వారియర్స్పై గెలుపొందింది.
టీమిండియాకు భారీ షాక్.. వన్డే, టెస్ట్ సిరీస్ నుండి రోహిత్ ఔట్!!
ఈ విజయంతో 18 పాయింట్లను ఖాతాలో వేసుకున్న పుణే 7 ఏసెస్ పాయింట్ల పట్టికలో నార్త్ ఈస్టర్న్ వారియర్స్తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మిగిలిన మరో బెర్త్ కోసం నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. ఈ రోజు మ్యాచ్ల్లో నార్త్ ఈస్టర్న్ వారియర్స్తో చెన్నై సూపర్ స్టార్స్; బెంగళూరు రాప్టర్స్తో ముంబై రాకెట్స్ తలపడతాయి.
మొదటగా జరిగిన పురుషుల డబుల్స్లో కొ సుంగ్ హ్యూన్-షిన్ బేక్ (అవధె వారియర్స్) జోడీ 6-15, 15-9, 15-12తో చిరాగ్ శెట్టి-సెతియావన్ (పుణే) జంటపై గెలుపొంది అవధె వారియర్స్కు శుభారంభం ఇచ్చింది. అయితే అనంతరం జరిగిన మహిళల సింగిల్స్లో 'ట్రంప్ కార్డు'తో ఆడిన అవధె వారియర్స్ ప్లేయర్, ప్రపంచ 14వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ 13-15, 12-15తో రితుపర్ణ (పుణే) చేతిలో ఓడటంతో... అవధె వారియర్స్కు ఒక పాయింట్ పెనాల్టీ పడింది.
మిక్స్డ్ డబుల్స్లో క్రిస్టీనా పెడర్సన్-సొజొనోవ్ (అవధె వారియర్స్) జంట 6-15, 9-15తో క్రిస్-గాబ్రియెల్ (పుణే) ద్వయం చేతిలో ఓడింది. దాంతో పుణే 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక పురుషుల తొలి సింగిల్స్లో 'ట్రంప్ కార్డు'తో ఆడిన కీన్ యూ లోహ్ (పుణే) 15-12, 15-14తో శుభాంకర్ డే (అవధె వారియర్స్)పై విజయాన్ని అందుకున్నాడు. చివరగా జరిగిన పురుషుల రెండో సింగిల్స్లో కజుమస సకాయ్ (పుణే) 15-6, 10-15, 13-15తో అజయ్ జయరామ్ (అవధె వారియర్స్) చేతిలో ఓడాడు. అయినా అవధెకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది.